కేరళ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ : సివిల్ సర్వీస్ పరీక్షలలో అర్హత దక్కించుకున్న వారు కేడర్, పనిచేసే చోటును ఎంచుకోవడానికి వీల్లేదని , వారికి ఈ హక్కులేదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. యుపిఎస్సి పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే వారు తాము దేశంలోని ఏ ప్రాంతంలో అయినా పనిచేయడానికి సిద్ధం అని, హోం కేడర్కు పట్టుబట్టబోమని తెలియచేయాల్సి ఉంటుంది. ఐఎఎస్ , ఐపిఎస్ లేదా ఐఎఫ్ఎస్ వంటి ఎటువంటి కేడర్ను అయినా సొంతంగా ఎంచుకోవడానికి వీల్లేదు. స్వీయరాష్ట్రం కోరుకోవడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు తెలిపింది. యుపిఎస్సి పరీక్షల ద్వారా ఐఎఎస్ అధికారిణి అయిన ఓ ముస్లిం మహిళ ఎ శైనమోల్ హిమాచల్ప్రదేశ్లో నియామకం పొందారు.
అయితే తనను స్వరాష్ట్రం కేరళకు మార్చాలని కోరుకుంది. దీనికి కేరళహైకోర్టు అనుమతిని ఇస్తూ తీర్పు వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లింది. దీనిపై న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, వి రామసుబ్రమణియన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును కొట్టివేసింది. ఈ సందర్భంగా మండల్కేసులో చారిత్రక తీర్పును ప్రస్తావించింది. ఎస్సి/ఎస్టి లేదా ఒబిసి కేటగిరిల అభ్యర్థులు యుపిఎస్సి పరీక్షలలో సివిల్ సర్వీస్ పోస్టులకు జనరల్ కేటగిరి అర్హత పొందితే వారు అన్రిజర్వ్డ్ ఖాళీలలో నియమించవచ్చునని సుప్రీం గత తీర్పులో తెలిపిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది.