అక్టోబర్ కల్లా సాధారణ పరిస్థితులు
జనవరి నుంచి టీకా పంపిణీ కార్యక్రమం
‘సీరమ్’ సిఇఒ అదర్ పూనావాలా
న్యూఢిల్లీ: భారత్లో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా తెలిపారు. డిసెంబర్ నెలాఖరుకల్లా ఆక్స్ఫర్డ్ కరోనా టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు ఇవ్వవచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘టీకా అత్యవసర వినియోగానికి కావాల్సిన అనుమతులు ఈ నెలాఖరుకల్లా రావచ్చు. అయితే ప్రజలందరికీ టీకా ఇచ్చేందుకు అవసరమయ్యే పూర్తి స్థాయి అనుమతులు వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది. ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిస్తే వచ్చే ఏడాది జనవరిలోనే టీకా పంపిణీ ప్రారంభం కావచ్చు’ అని అదర్ పేర్కొన్నారు. భారత్లో కనీసం 20 శాతం మందికి టీకా అందితే దేశంలో నమ్మకం పెరుగుతుందన్నారు.
ఇక, వచ్చే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి అందిరికీ సరిపడా టీకాలు అందుబాటులోకి వచ్చి పరిస్థితులు సాధారణ స్థితికి రావచ్చు అని ఆయన అభిప్రాపడ్డారు. ఇటీవలే సీరమ్తో పాటు భారత్ బయోటెక్ కంపెనీలు తమ కరోనా టీకాలకు అత్యవసర అనుమతులు కావాలంటూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఒకటి ఏర్పాటైంది. అయితే ఈ రెండు కంపెనీలు తమ ఫేజ్-2,3 క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి సేఫ్టీ డాటా వివరాలను ఇవ్వాలని కోరింది.
Vaccine drive start from January 2021 in India