హైదరాబాద్: భార్య, కూతురును అమెరికాలో వదిలేసి ఇండియాకు వచ్చిన భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగిన సంఘటన నగరంలోని ఆల్విన్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. ప్రగతి నగర్కు చెందిన నాగశిరీషకు, కూకట్పల్లి, జయానగర్కు చెందిన వీరం నాగవెంకటప్రసాదరావుతో 2008లో పెద్దల సమక్షంలో వివాహమైంది. ప్రసాదరావు అమెరికాలో ఎంఎస ఫూర్తి చేసి అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం తర్వాత భార్యను అమెరికా తీసుకుని వెళ్లాడు. అమెరికాలోని న్యూజెర్సీలో భార్యభర్తలు స్థిరపడ్డారు. అయితే నాగశిరీష ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ప్రసాదరావు తరచూ వేధింపులకు గురిచేసేవాడు. అయినా వాటిని ఓపికతో భరించింది. ఈ క్రమంలోనే వీరికి కూతురు పుట్టింది.
అయినా కూడా నిందితుడు శిరీషపై వేధింపులు ఆపలేదు సరికదా భార్య, కూతురిని 2016లో అమెరికాలో వదిలేసి హైదరాబాద్కు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సరైన కారణాలు చెప్పకుండానే విడాకుల నోటీసు పంపించాడు. కొద్ది రోజుల తర్వాత విడాకుల కేసును వాపస్ తీసుకున్నాడు. ఇటీవల నాగశిరీష తన కూతురు యశస్విని తీసుకుని అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చింది. తన భర్త ప్రసాదరావు ఇంటికి వెళ్లగా అత్తామామలు ఇంటికి తాళం వేసి ఇంట్లోకి రానివ్వలేదని నాగశిరీష ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. నాగశిరీషకు స్థానిక మహిళలు, మహిళా సంఘం ప్రతినిధులు మద్దతుగా నిలిచారు. మహిళా సంఘాల ప్రతినిధులు తాళం పగులగొట్టి నాగశిరీషను ఇంట్లోకి పంపించేందుకు యత్నించారు.