Thursday, May 9, 2024

నేటి నుంచే వాడీవేడిగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

- Advertisement -
- Advertisement -

Winter Session of Parliament from tomorrow

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాల అస్త్రాలు
దీటుగా తిపి కొట్టేందుకు అధికార పక్ష వ్యూహాలు
రేపటినుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
తొలి రోజే సాగు చట్టాల రద్దు బిల్లు

న్యూఢిల్లీ: సోమవారంనుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు గతంలో మాదిరిగానే వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు సమస్యలతో పాటుగా పెగాసస్ వ్యవహారం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి పలు అంశాలపై సభో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉండడంతో శీతాకాలంలోను సభలో వేడి కొనసాగే అవకాశం ఉంది. సోమవారంనుంచి మొదలు కానున్న పార్లమెంటు సమావేశాల కోసం ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సమావేశాల తొలి రోజే సాగు చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనుండడంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య వాడీ వేడి వాదనలు కొనసాగే అవకాశం ఉంది. అత్యంత కీలకమైన ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న తరుణంలో సభలో తమ సభ్యులందరూ ఉండే విధంగా అధికార బిజెపి, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ సైతం జారీ చేశాయి. రైతుల కష్టాలతో పాటుగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న వారి ప్రధాన డిమాండ్‌పై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.

మరో వైపు ప్రతిపక్షాలనుంచి ఎదురయ్యే ప్రశ్నలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార ఎన్‌డిఎ పక్షం కూడా సంసిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం బిజెపి పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు కూడా హాజరయ్యాయి. పార్లమెంటులో విపక్షాలకు దీటుగా సమాధానమిచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేస్తారని భావిస్తున్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టం( సిఎఎ)ను రద్దు చేయాలని ఈ సమావేశంలో తాను డిమాండ్ చేసినట్లు ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ నాయకురాలు అగాథా సంగ్మా చెప్పారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగు చట్టాలను ఉపసంహరించుకొంటున్నందున, అదే స్ఫూర్తితో , ఈశాన్య రాష్ట్రాల ప్రజల మనోభావాలను గౌరవించడం కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సమావేశంలో తాను కోరినట్లు ఆమె చెప్పారు.

తన డిమాండ్‌పై ప్రభుత్వంనుంచి ఎలాంటి స్పందనా రాలేదని, అయితే తన డిమాండ్‌ను అది పరిగణనలోకి తీసుకుందని ఆమె చెప్పారు. సాగు చట్టాల రద్దు బిల్లుతో పాటుగా మొత్తం 26 బిల్లులను సభ ముందుకు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల జారీ చేసిన మూడు ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రవేశ పెట్టే బిల్లులు కూడా వీటిలో ఉన్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్( సివిసి), సిబిఐ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పెంచడంతో పాటుగా ఈ దర్యాప్తు ఏజన్సీలకు విశేష అధికారాలను కట్టబెడుతూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్ కూడా వీటిలో ఉంది. ఈ ఆర్డినెన్స్‌పై ప్రతిపక్షాలన్నీ ఇప్పటికే మండి పడుతున్న విషయం తెలిసిందే. అలాగే క్రిప్టో కరెన్సీని కట్టడి చేయడానికి ఉద్దేశించిన బిల్లు కూడా ఇదే సమావేశాల్లో సభ ముందుకు రానుంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌సి, ఎస్‌టిల జాబితాను సవరించడానికి ఉద్దేశించిన కీలక బిల్లు కూడా ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు.యుపిలో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బిల్లు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News