జైపూర్: రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా మిత్దియా గ్రామంలో 29 నెమళ్లు విషపు ఆహారం తిని చనిపోయాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… మిత్ దియా గ్రామ శివారుల్లో 26 నెమళ్ల కళేబరాలు కనిపించడంతో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు నెమళ్లను దగ్గరలో గుర్తించారు. వాటిని వెంటనే వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అవి చనిపోయాయని వైద్యులు వెల్లడించారు. అక్కడే మరో ఎనిమిది పావురాలు చనిపోయాయి. విషపూరితమైన ఆహారం పదార్థాలు తీసుకోవడంతో నెమళ్లు చనిపోయి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే పురుగుల మందులో గింజలను కలిసి నెమళ్లకు వేసి ఉంటారని భావిస్తున్నారు. చనిపోయిన నెమళ్లలో 16 మగవి, 13 ఆడ నెమళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. నెమళ్ల కళేబరాలను పోస్టుమార్టమ్ నిమిత్తం నాగౌర్ జిల్లా వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. విషం పెట్టి నెమళ్లను చంపితే 1972 అటవీ శాఖ రూల్స్ ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారి బాబు లాట్ జాజు తెలిపాడు.