Monday, April 29, 2024

ప్రాంతీయ పార్టీల ఆదాయంలో 76 శాతం

- Advertisement -
- Advertisement -

‘అజ్ఞాత మార్గాల’ద్వారా లభించిందే
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రాబడి రూ.887.55 కోట్లు
ఎడిఆర్ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరంలో అజ్ఞాత మార్గాలనుంచి ప్రాంతీయ పార్టీలకు లభించిన ఆదాయం ఏకంగా రూ.887.55 కోట్లకు పెరిగిపోయిందని, ఆ పార్టీల మొత్తం ఆదాయంలో 76 శాతం ఇదే ఉందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) అనే సంస్థ నివేదిక పేర్కొంది. 2020 21ఆర్థిక సంవత్సరంలో ఈ పార్టీల అజ్ఞాత మార్గాల ద్వారా లభించిన ఆదాయంతో పోలిస్తే ఇది రూ.530.70 కోట్లు ఎక్కువ. 2020 21 ఆర్థిక సంవత్సరంలో ఈ వర్గాల నుంచి ప్రాంతీయ పార్టీలకు లభించిన ఆదాయం రూ.263.93 కోట్లు అంటే పార్టీల మొత్త ఆదాయంలో 49.3 శాతంగా ఉంది.

రూ.20,000, అంతకు పైబడిన విరాళాలను తెలిసిన మార్గాలు( నోన్ సోర్స్)గా పేర్కొంటారు. ఎందుకంటే ఆ విరాళాలు ఇచ్చిన వారి వివరాలు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన కంట్రిబ్యూషన్‌రిపోర్టుల ద్వారా తెలుస్తాయి. అయితే అజ్ఞాత మార్గాల ద్వారా వచ్చే రాబడిని ఈ ప్రాంతీయ పార్టీలు తమ వార్షిక నివేదికలో పేర్కొంటాయి కానీ, అయితే ఆ ఆదాయం ఎక్కడినుంచి వచ్చిందనే వివరాలు మాత్రం ఉండవు. ఎలకోరల్ బాండ్లు, కూపన్ల అమ్మకం, రిలీఫ్ ఫండ్స్, ఇతర ఆదాయాలు, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు, మోరాల ద్వారా వచ్చే విరాళాలు లాంటివి ఈ అజ్ఞాత మార్గాల కిందికి వస్తాయని ఎడిఆర్ తెలిపింది. అలాంటి స్వచ్ఛంద విరాళాలు అందజేసిన దాతల వివరాలు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉండవు.

రాజకీయ పార్టీల మొత్తం ఆదాయంలో అజ్ఞాత మార్గాల ద్వారా లభించిన మొత్తం రూ.887.55 కోట్లకు చేరుకుందని, ఇది వాటి మొత్తం ఆదాయంలో 76.115 శాతం అని ఎడిఆర్ తెలిపింది. ఇందులో 93.26 శాతం అంటే రూ.827.76 కోట్లు ఒక్క ఎలక్టోరల్ బాండ్లనుంచే వచ్చిందని ఆ సంస్థ తెలిపింది. కూపన్ల అమ్మకం ద్వారా లభించిన ఆదాయం 4.32 శాతం (రూ.38.35 కోట్లు),రూ.20 వేలకన్నా తక్కువ స్వచ్ఛంద విరాళాలు 2.40 శాతం (రూ.21.29 కోట్లు) మేర ఉన్నాయని ఎడిఆర్ తెలిపింది. ఈ వివరాలు 27 ప్రాంతీయ పార్టీలకు సంబంధించినవని కూడా ఆ సంస్థ తెలిపింది.

మొదట్లో 54 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలను ఈ విశ్లేషణ కోసం పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని, అయితే వాటిలో కేవలం 28 పార్టీలు మాత్రమే తమ వార్షిక ఆడిట్, విరాళాల నివేదికలు రెండూ సమర్పించాయని, మిగతా పార్టీలు ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే సమర్పించాయని ఎడిఆర్ తన నివేదికలో తెలిపింది. 2021 22 ఆర్థిక సంవత్సరంలో 27 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1,165.58 కోట్లు కాగా తెలిసిన దాతల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.145.42 కోట్లు మాత్రమేనని ఆ నివేదిక పేర్కొంది. సభ్యత్వ ఫీజులు, బ్యాంకు వడ్డీలు, ప్రచురణల అమ్మకాలు, పార్టీ లెవీ తదితర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం మరో రూ.132.62 కోట్లు ఉన్నట్లు ఎడిఆర్ నివేదిక వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News