Monday, April 29, 2024

వీధి కుక్కపై దాడి: 8 మందిపై కేసు

- Advertisement -
- Advertisement -

లక్నో: వీధి కుక్కపై ఇటుకలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన 8 మంది వ్యక్తులపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. లక్నోలోని ఆషియానా ప్రాంతంలోని పక్రి పూల్ సమీపంలో ఆదివారం రాత్రి ఒక వీధి కుక్కను రాళ్లు, ఇటుకలతో విచక్షణారహితంగా కొడుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు కుక్కను టూవీలర్‌లో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు ఆషియానా పోలీసు స్టేషన్‌లో సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్లు అంకిత్ రావత్ అనే వ్యక్తి తెలిపారు.

ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తాను తన పెంపుడు కుక్క జర్మన్ షెపర్డ్‌ను బయట నుంచి ఇంటికి తీసుకువెళుతుండగా ఒక కుక్క ఏడుపులు వినిపించాయని రావత్ చెప్పారు. తాను బయటకు వెళ్లి చూడగా ఐదారుగురు వ్యక్తులు ఒక వీధికుక్కను విచక్షణారహితంగా కొడుతున్న దృశ్యం కనిపించిందని ఆయన తెలిపారు. అడ్డుకోవడానికి వెళ్లిన తనను వాళ్లు బెదిరించారని, దీంతో తాను ఇంటికి వచ్చేసి 112 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందచేశానని ఆయన చెప్పారు.

తాను కెమెరాలో ఆ దృశ్యాన్నంతా వీడియో తీశానని ఆయన చెప్పారు. రావత్ ఫిర్యాదు ఆధారంగా మున్నా రాజ్‌పుత్, మోహిత్ రాజ్‌పుత్, కరన్ పండిట్, సన్నీ, సూరజ్, అజయ్, విశాల్, హర్స్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కంటోన్మెంట్ ఎసిపి అభినవ్ కుమార్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News