Monday, April 29, 2024

బాబు బెయిల్‌పై నేడు కీలక తీర్పులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన టిడిపి అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. నెల రోజులకుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు సోమవారం రానున్నాయి. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఎలా ంటి ఆధారాలు లేకుండా తనపై సిఐడి నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు తన క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల ఈ పిటిషన్ లో వాదనలు విన్న జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దాంతో, సుప్రీంకోర్టులో సోమవారం విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అటు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పైనా, సిఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపైనా విజయవాడ ఎసిబి కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లపై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ లో ఉంచింది. సోమవారం ఈ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది. ఇక, రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు , అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై ఎపి హైకోర్టులో సోమవారం తీర్పు వెలువడనుంది. ఈ కేసుల్లో ఇటీవల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష్ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ -డిజైన్‌టెక్ సంస్థ్లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జిఎస్‌టితో కలిపి రూ.370 కోట్లను అప్పటి ప్రభుత్వం చెల్లించింది.

ప్రభుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ్ల్ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారంటూ ఎపి సిఐడి కేసు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు మోపింది. పలువురిపై సిఐడి కేసులు కూడా నమోదు చేసింది. దాదాపు రూ. 240 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఎపి సిఐడి ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన రూ. 370 కోట్లలో రూ.240 కోట్లను వేర్వేరు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర కంపెనీలకు నిధులు మళ్లించారని సిఐడి అంటోంది. నాడు సీమెన్స్ సంస్థ ఇండియా హెడ్‌గా ఉన్న సుమన్ బోస్, డిజైన్‌టెక్ సంస్థ ఎండీగా ఉన్న వికాస్ కన్వికర్ ద్వారా కుంభకోణం నడిపించినట్టు ఆరోపిస్తోంది. నిజానికి రూ.3300 కోట్ల ప్రాజెక్టుగా ఎంవొయూ చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం జీవోలో మాత్రం రూ.3300 కోట్ల ప్రస్తావనను తొలగించింది. చివరకు రూ.240 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా మళ్లించేశారని సిఐడి ఆరోపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News