కరోనా చికిత్సలో రెమ్డెసివిర్ యాంటీ వైరల్ జౌషధాన్ని వినియోగించడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎబోలా వ్యాధి చికిత్స కోసం గిలీడ్ ఫార్మసీ కంపెనీ తయారు చేసిన ఈ రెమ్డెవిల్ ఇప్పుడు కరోనా నియంత్రణలో సత్ఫలితాలు చూపిస్తోందని అమెరికా వైద్యులు ధ్రువీకరించడంతో దీన్ని కరోనా చికిత్సలో అత్యవసరంగా వినియోగించడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) అనుమతించింది. ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల పరిస్థితి విషమించినట్టైతే ఈ రెమ్డెసివిర్ను ఇవ్వాలని ఎఫ్డిఎ సూచించింది. మిగతా ఔషధాలతో పోలిస్తే రెమ్డెసివిర్ తీసుకున్న రోగులు 31 శాతం వేగంగా కోలుకుంటున్నారని అధ్యయనంలో రుజువైందని ఎఫ్డిఎ వెల్లడించింది. ఈ డ్రగ్ వినియోగం వల్ల మనుషులకు ఎటువంటి హాని ఉండదని ప్రయోగాల వల్ల తేలింది. అయితే ఇంకా బలమైన ఆధారాలు అందిస్తే ఈ డ్రగ్ను పూర్తిగా వినియోగించడానికి అనుమతి ఇస్తామని ఎఫ్డిఎ స్పష్టం చేసింది.
ఎఫ్డిఎ నిర్ణయాన్ని అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. గిలీడ్ ఫార్మా సిఇఒ డానియల్తో కలసి ఆమోద ప్రకటన చేశారు. కరోనా చికిత్స కోసం ఇది తొలి ఆమోదిత ఔషధమని ఇదో ముందడుగు అని ఎఫ్డిఎ కమిషనర్ స్టీఫెన్ హాన్ ప్రశంసించారు. అమెరికాలో జరిగిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ డ్రగ్ స్పష్టమైన పనితీరు కనబరిచిందని అమెరికా శాస్త్రవేత్త ఆంథోనీ ఫాచీ అభిప్రాయం వెలిబుచ్చారు. అమెరికా అంటువ్యాధుల పరిశోధన సంస్థ ఆధ్వర్యం లోనే ఈ అధ్యయనం జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా మలేరియా జౌషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ ను కూడా అమెరికా ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు వినియోగిస్తున్నారు. ఇది అత్యంత ప్రభావంతమైన ఔషధంగా వారు పరిగణిస్తున్నారు.