వాషింగ్టన్: ప్రధాని మోడీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం వచ్చి చేరింది. అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘ లెజియన్ ఆఫ్ మెరిట్’ను మోడీకి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం బహూకరించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒ బ్రయాన్ చేతలు మీదుగా మోడీ తరఫున అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు వైట్హౌస్లో సోమవారం ఈ అవార్డును స్వీకరించారు. భారత్ అమెరికా వ్యూహాత్మక బంధాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లడంలో మోడీ చొరవకు గాను ఆయనకు ఈ అవార్డును బహూకరించినట్లు ఓ బ్రయాన్ చెప్పారు.
దీంతో ఈ అవార్డు కింద దేవాధినేతలకు లభించే చీఫ్ కమాండర్ హోదా మోడీని వరించింది. మోడీతో పాటుగా ఈ అవార్డును ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు కూడా బహూకరించారు. సైన్యంతో పాటుగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేసిన దేశాధినేతలకు అమెరికా ఈ పురస్కారాన్ని అందిస్తుంటుంది. మోడీని గతంలోను అనేక దేశాలు ఆయా దేశాల అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. 2016లో సౌదీ అరేబియా అబ్దులాజీజ్ అల్ సౌద్ అవార్డు, అఫ్గానిస్థాన్ నుంచి అమీర్ అబ్దుల్లా ఖాన్ అవార్డు, సియోల్ పీస్ ప్రైజ్ 2018,రష్యానుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోజల్ అవార్డు, యుఎఇనుంచి జాయేద్ మెడల్ను మోడీ అందుకున్నారు.