న్యూఢిల్లీ : ఉగ్రవాదులకు బెంగళూరు ప్రధాన అడ్డాగా మారుతున్నదని బిజెపి ఎంపి తేజస్వీసూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఎ) శాశ్వత డివిజన్ కార్యాలయాన్ని బెంగళూరులో ఏర్పాటు చేయాలని కేంద్రహోంమంత్రి అమిత్షాను కోరినట్టు ఆయన తెలిపారు. బెంగళూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యంవహిస్తున్న సూర్య, బిజెపి యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇటీవల ఉగ్రవాదుల మూలాలు బెంగళూరులో బయటపడ్తున్నాయని, ఉగ్రవాద సంస్థలు ఆ నగరాన్ని తమ నిద్రాణ కేంద్రంగా మలచుకోవాలని యోచిస్తున్నట్టుగా ఉన్నదని సూర్య అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మూడు రోజుల క్రితం అమిత్షాను కలిసి పరిస్థితి వివరించినట్టు సూర్య తెలిపారు. ఎస్పి ర్యాంక్ అధికారి నేతృత్వంలో ఎన్ఐఎ శాశ్వత కార్యాలయాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తానని అమిత్షా తనకు హామీ ఇచ్చారని సూర్య తెలిపారు. కర్నాటకలో బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉండగా, అదే పార్టీకి చెందిన కీలక నేత ఇంత ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం.