న్యూఢిల్లీ : ఏడాది కాలంలో బిజెపి తన చిరకాల మిత్రుల్ని కోల్పోయింది. అందులో ఒకటి శివసేన కాగా, మరొకటి శిరోమణి అకాలీదళ్(ఎస్ఎడి). అయితే, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి నుంచి వైదొలగడానికి ఈ రెండు పార్టీలకు వేర్వేరు కారణాలున్నాయి. గతేడాది శివసేన ఎన్డిఎ నుంచి బయటకు రాగా, ఇటీవలే ఎస్ఎడి బిజెపితో తెగతెంపులు చేసుకున్నది. మహారాష్ట్రలో అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకుందామన్న తన ప్రతిపాదనకు బిజెపి అంగీకరించకపోవడంతో శివసేన ఎన్డిఎ నుంచి బయటకొచ్చింది. దాంతో, హిందూత్వవాదులుగా పేరున్న ఈ రెండు పార్టీలు తమ చిరకాల మిత్రత్వానికి తిలోదకాలిచ్చాయి.
దాంతో, గతేడాది నవంబర్లో కాంగ్రెస్, ఎన్సిపితో కొత్త కూటమికి తెరలేపిన శివసేన మహారాష్ట్రలో అధికారం చేపట్టింది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో బిజెపి తెచ్చిన మూడు రైతు బిల్లుల్ని వ్యతిరేకించిన ఎస్ఎడి మొదట కేంద్రంలో తమకున్న ఒకే ఒక్క మంత్రితో రాజీనామా చేయించి నిరసన తెలిపింది. ఎవరినీ లెక్క చేయకుండా మొండిగా నిర్ణయం తీసుకున్న బిజెపి ఆ మూడు బిల్లుల్నీ పార్లమెంట్లో పాస్ చేయించడంతో ఎస్ఎడికి ఏంచేయాలో తోచని పరిస్థితి. కూటమి నుంచి వైదొలగడమే గౌరవప్రదమనుకొని నిర్ణయం తీసుకున్నది. దాంతో,పాక్ సరిహద్దు రాష్ట్రం పంజాబ్లో బిజెపి తనకున్న బలమైన మిత్రుణ్ని కోల్పోయినట్టయింది.