చెన్నై: ఇంగ్లండ్తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి రెండు టెస్టు మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తమిళనాడు క్రికెట్ సంఘం శనివారం అధికారికంగా ధ్రువీకరించింది. తొలుత 50 శాతం సామర్థంతో టెస్టు మ్యాచ్లను నిర్వహించాలని బిసిసిఐ భావించింది. కానీ కరోనా సెకండ్ వేవ్ను దృష్టిలో పెట్టుకుని తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో కరోనా తీవ్రత ఇంకా అధికంగానే ఉంది. ఇలాంటి స్థితిలో రిస్క్ తీసుకోవడానికి బిసిసిఐ సిద్ధంగా లేదు. ఇరు జట్ల క్రికెటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తొలి రెండు టెస్టులను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇక బిసిసిఐ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై జరుగుతున్న తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే కావడంతో క్రికెట్ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు ఆశించారు. కానీ బిసిసిఐ తీసుకున్న నిర్ణయంతో వారు నిరాశ చెందారు.
భారీ ఏర్పాట్లు…
ఫిబ్రవరి ఐదు నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తమిళనాడు క్రికెట్ సంఘం అధికారులు తెలిపారు. ఇరు జట్ల క్రికెటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బయోబబుల్ విధానంలో తొలి రెండు టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక మ్యాచ్ల సందర్భంగా మీడియాకు కూడా అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. కేవలం క్రికెటర్లు, సహాయక సిబ్బందికి మాత్రమే మ్యాచ్ల సందర్భంగా ప్రవేశం ఉంటుందని వారు వివరించారు. ఇక ఇరు జట్ల క్రికెటర్ల కోసం ప్రత్యేక హోటల్ను బుక్ చేశారు. ఈ హోటల్లో కేవలం క్రికెటర్లు, సహాయక సిబ్బంది మాత్రమే ఉంటారు. ఇక క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్ వచ్చిన క్రికెటర్లకు మాత్రమే మ్యాచ్లో బరిలోకి దిగేందుకు అనుమతి ఇస్తారు. ఒకవేళ ఎవరికైనా కరోనా ఉన్నట్టు తేలితే వారిని ఐసోలేషన్లో ఉంచుతామని పేర్కొన్నారు. ఇక క్రికెటర్లు బస చేసే హోటల్లో ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
BCCI will not allow fans for Ind vs Eng first two tests