ఎస్పి అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్
లక్నో:తనతోపాటు తమ పార్టీ నేతల ఫోన్లను ఉత్తర్ప్రదేశ్లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ట్యాప్ చేయిస్తున్నదని సమాజ్వాదీపార్టీ(ఎస్పి) అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రోజూ సాయంత్రం తమ ఫోన్ సంభాషణలను వింటున్నారని అఖిలేశ్ అన్నారు. ఆదిత్యనాథ్ నేతృత్వంలో పనికిరాని ప్రభుత్వం యుపిలో అధికారంలో ఉన్నదని ఆయన మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను బిజెపి ట్యాప్ చేయిస్తున్నదని అఖిలేశ్ అన్నారు. ఆదివారం లక్నోలోని ఎస్పి ప్రధాన కార్యాలయంలో అఖిలేశ్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో అఖిలేశ్తో ఎస్పి జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్రాయ్ ఉన్నారు. శనివారం మవు జిల్లాలో రాయ్కి చెందిన ఇంట్లో ఆదాయంపన్నుశాఖ అధికారులు సోదాలు చేయడం గమనార్హం. ఐటి సోదాల నేపథ్యంలో ఎస్పిపై ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఎవరి ఆస్తులైనా ఐదేళ్లలో 200 రెట్లు పెరుగుతాయా..? ఎస్పి హయాంలో అలా పెరిగాయంటూ ఆదిత్యనాథ్ విమర్శించారు.