Monday, April 29, 2024

కుల గణన ఆవశ్యకత

- Advertisement -
- Advertisement -

భారతీయ సమాజంలో కులం అంతర్భాగం. కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ. కుల వ్యవస్థ వ్యక్తి పుట్టుకతో నిర్ణయించబడిన వర్గ నిర్మాణం. వ్యక్తిగత జీవనశైలి ద్వారా, సాధించే సామాజిక గౌరవం ద్వారా కులం ప్రాథమికంగా నిర్వచించబడుతుంది. భారత ప్రభుత్వం పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 3000 కులాలు 25,000 ఉప కులాలు వున్నాయి. నిజానికి భారత దేశంలో పని చేస్తున్న కుల వ్యవస్థను జాతి అంటారు. వేదకాలంలో సమాజంలో నాలుగు వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా ఉండేవి. వర్ణాల నుండే కులాల ఏర్పడ్డాయని వాదనా వుంది. క్రీ.పూ 1500లో ఆర్యులు భారత దేశానికి వచ్చారు. సామాజిక, చారిత్రక సిద్ధాంతం ప్రకారం భారత దేశంలో కుల వ్యవస్థ ఆర్యుల రాకతో ప్రారంభమైంది.భారత దేశంలో మొట్టమొదటిసారిగా 1872లో జనాభా లెక్కలు ప్రారంభం అయ్యాయి. సామాజిక, -ఆర్థిక, కులగణన ఎస్‌ఇసిసి మొట్టమొదట 1931లో నిర్వహించారు.

ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భారతీయ కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై సమాచారాన్ని సేకరించడం, లేమి సూచికలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. 1941లో కూడా కులగణన చేయాలనే అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించి సమాచారం సేకరించింది. కానీ రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఆ సమాచారాన్ని బయటపెట్టలేకపోయింది. 1951 తర్వాత జాతీయ ఐక్యతను పెంపొందించడానికి కులగణన సేకరణను నిలిపివేయాలనీ అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది.1951 నుండి 2011 వరకు స్వతంత్ర భారత దేశంలోని ప్రతీ జనాభా గణనలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన సమాచారం సేకరించి ప్రచురించారు. దేశ వ్యాప్తంగా బిసిలు 52% ఉన్నారన్న మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా 1931 కులగణనను ఆధారంగా చేసుకుని చేసినవే. రిజర్వేషన్లు 50% దాటకూడదని నిబంధన దృష్టిలో ఉంచుకొని ఒబిసిలకు 27% రిజర్వేషన్లను మండల్ కమిషన్ సిఫారసు చేసింది.

సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం
నేషనల్ శాంపిల్ సర్వే 2011 -12 లెక్కల ప్రకారం అగ్ర కులాలతో పోల్చినప్పుడు బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు చాలా వెనుకబడి ఉన్నారని తెలుస్తున్నది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2016- 17 ప్రకారం దేశంలో 28% ప్రజలు మల్టీ డైమెన్షనల్ పార్టీ పరిధిలో వున్నారు. ఎస్‌టిలు 50% ఎస్‌సిలు 33% ఒబిసిలు 27% పేదరికంలో వున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే 2017 -18 ప్రకారం విద్యారంగంలో ఎస్‌టిలు 3%, ఎస్‌సిలు 4%, ఒబిసిలు 6%, జనరల్ క్యాటగిరి 12% గ్రాడ్యుయేట్స్ వున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌లో జనరల్ కేటగిరీలో 3%, ఒబిసిలో 1% మాత్రమే వున్నారు. ఉపాధి రంగం జనరల్ కేటగిరిలో 30%, ఒబిసిలో 20%, ఎస్‌టిలు 12% మాత్రమే స్థిరమైన ఉద్యోగాలు పొందుతున్నారు. రోజువారీ కూలీలు ఎస్‌టిలు 29%, ఎస్‌సిలు 38%, ఒబిసిలు 20%, జనరల్ కేటగిరీలో 11% మాత్రమే ఉన్నారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 2021 లెక్కల ప్రకారం 52.7% మంది జనరల్ కేటగిరి చెందిన వారే వున్నారు. అందులో కూడా అధిక వేతనం అందుకునే ఉన్నత ఉద్యోగాల్లో 64% పైగా జనరల్ కేటగిరీ వారే వున్నారు.

ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు అధికారికంగా వెల్లడించినవే. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అన్ని రంగాల్లో జనరల్ కేటగిరి వారితో పోల్చితే ఒబిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకబడ్డారని అర్థమవుతుంది. భారతీయ సమాజం సమగ్ర చిత్రాన్ని రూపొందించాలన్నా, సమాజంలో గల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్నీ నిర్మూలించి అసమానతలు తగ్గించాలన్నా, దేశంలో కుల నిర్మూలన చేయాలన్నా వనరుల సమాన పంపిణీ, పథకాల రూపకల్పనకు కులాల సమగ్ర సమాచారం అవసరం.నవంబర్ 25 1949 లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ తన చివరి ఉపన్యాసంలో ‘ప్రతి మనిషికి ఒక ఓటు, ప్రతి ఓటుకు సమాన విలువ ఇవ్వడం ద్వారా రాజకీయ రంగంలో సమానత్వాన్ని సాధించాం. సాంఘిక, ఆర్థిక రంగాల్లో సమానత్వం సాధించాలి, భవిష్యత్తు పాలకులు అందుకు కృషి చేయాలి’ అని అన్నారు. సాంఘిక, ఆర్థిక సమానత్వ కోసం కులగణన ఆవశ్యకం. భారత రాజ్యాంగం కూడా కులగణనను నిర్వహించడాన్ని సమర్థిస్తోంది. ఆర్టికల్ 340 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులను పరిశోధించడానికి, ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి సిఫార్సులు చేయడానికి ఒక కమిషన్‌ను నియమించాలని ఆదేశించింది.

రాజకీయ పార్టీల వైఖరి
2018లో పార్లమెంట్ సాక్షిగా అప్పటి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత దేశంలో రాబోయే జనగణనలో కులగణన తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం బిజెపి పార్టీ కులగణనను వ్యతిరేకిస్తోంది. 2021లో పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం రాబోయే జనాభా గణనలో ఎస్‌సి, ఎస్‌టి కులగణన మాత్రమే చేస్తామని, ఒబిసి గణన చేయమని స్పష్టం చేసింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తాము గెలిస్తే దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని, బిసిల రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 2011లో యుపిఎ హయాంలో కుల గణన కోసం ప్రణాళికలు తయారు చేసే నిధులు కూడా కేటాయించింది. వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎంలు కులగణనకు మద్దతుగా తీర్మానాలు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేస్తామని ప్రకటించారు.బీహార్ రాష్ట్రం జనవరి 2023లో మొట్టమొదట కులగణన చేసి ఫలితాలను ప్రకటించింది. రాష్ట్ర జనాభాలో మూడింట రెండు వంతుల (63%) మంది వెనుకబడిన వర్గాలకు చెందినవారున్నా రని సర్వేలో తేలింది.

కులగణన వల్ల సమాజంలో కుల వ్యవస్థ బలోపేతం అవుతుందని, కులాలవారీగా ప్రజలను వర్గీకరించడం అంటే వ్యక్తిగత హక్కులు హరించడమే అని, కులాలను నిర్వచించడం కష్టమని, ఇది సమాజంలో గందరగోళం, వివాదాలకు దారితీసి దేశ సమగ్రతకు భంగం కలిగిస్తుందనే వాదన కూడా ఉంది. కులగణనకు అనుకూలంగా, వ్యతిరేకంగా వాదనలు వున్నప్పటికీ, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి, వనరుల సమాన పంపిణీని నిర్ధారించడానికి వెనుకబడిన కులాల జనాభా సమాచారం అవసరం.సమగ్ర కులాల సమాచారం సామాజిక అసమానతలను పరిష్కరించడంలో, సమానత్వ సమాజాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కులాల వివరాలు సేకరించింది. దీనికి చట్టబద్ధత లేకపోవడంతో న్యాయస్థానంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనపై చట్టం చేసి సర్వే ప్రారంభించాలి. కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం బిసిలకు రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం హర్షణీయం. శాస్త్రీయ పద్ధతిలో కులగణన సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన వర్గాలకు, పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News