గోవా: బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని సిబిఐ శుక్రవారం విచారించింది. ముంబైలోని డిఆర్డివొ అతిథి గృహంలో రియాను సిబిఐ అధికారులు పది గంటలకుపైగా ప్రశ్నించారు. రియాతోపాటు ఆమె సోదరుడు శౌవిక్ చక్రవర్తి ఉదయం 1040కి సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. శౌవిక్ను గురువారం 14 గంటలపాటు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. శుక్రవారం సిబిఐ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి ఈ కేసులోని నిందితుల్ని ప్రశ్నించారు. ఓ బృందం సుశాంత్ వంటమనిషి నీరజ్, ఫ్లాట్మేట్ సిద్ధార్థ్పితానీ, శామ్యూల్మిరిందాను ప్రశ్నించింది.
మరో బృందం రియాను, ఇంకో బృందం శౌవిక్ను ప్రశ్నించింది. సుశాంత్తో పరిచయం ఎలా ఏర్పడింది..? ఆ పరిచయం ఎంత వరకు వెళ్లింది..? పెళ్లి చేసుకుందాం అనుకున్నారా..?సుశాంత్ను వీడి జూన్ 8న బయటకు ఎందుకు వెళ్లారు..?ఇద్దరి మధ్యా ఏవైనా గొడవలు జరిగాయా..? జూన్ 914 మధ్య ఇద్దరి మధ్య ఏవైనా సంభాషణలు నడిచాయా..? ఆయన మరణవార్త ఎవరు తెలియజేశారు..?ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు..? తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లారా..? అతని బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు ఎవరి ఖాతాల్లోకి వెళ్లింది..? సుశాంత్ ఆరోగ్య సమస్యలేమిటి..? ఆయన ఏ మందులు వాడారు..? ఆయనకు వైద్యం చేసిన డాక్టర్లు ఎవరు..? లాంటి ప్రశ్నలను రియాకు సిబిఐ అధికారులు సంధించినట్టు తెలుస్తోంది.
సిబిఐ బృందానికి నేతృత్వం వహిస్తున్న నూపూర్ప్రసాద్ ఆమె సమాధానాలను రికార్డు చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కేసులో గోవా వ్యాపారవేత్త గౌరవ్ఆర్యకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల 31న ఉదయం 11 గంటల వరకల్లా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గోవాలోని అంజునాలో టామరిండ్ హోటల్ యజమానియైన ఆర్యను డబ్బు అక్రమ తరలింపు నిరోధక చట్టం(పిఎంఎల్ఎ) కింద ఇడి దర్యాప్తు జరపనున్నది. ఆర్యకూ సుశాంత్కు, రియాకు మధ్య ఆర్థిక లావాదేవీలపైనా ఈ దర్యాప్తు జరగనున్నది. వాట్సాప్లో ఆర్యతో రియా మాట్లాడినట్టు రికార్డు కావడంతో దర్యాప్తు జరుపుతున్నారు.