చర్చల ద్వారా రైతుల ఆందోళనను పరిష్కరించండి
కేంద్రానికి కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ సూచన
న్యూఢిల్లీ: జాతీయ ఏకాభిప్రాయంతోనే సంస్కరణలు తీసుకురావలసిన అవసరం ఉంటుందని, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఆందోళనను పరిష్కరించడానికి రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయాన్ని తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన వార్షక ఫిక్కీ ఎజిఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా నష్టపోయిన అన్ని వర్గాలు ముఖ్యంగా పేదలకు ఉదారంగా ఆర్థిక సహాయం అందచేయాలని ఆయన కోరారు. ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. స్థూల జాతీయ ఉత్పత్తి(జిడిపి)లో 10 శాతాన్ని దేశం కోల్పోయిందని, 2019-20 స్థాయికి తిరిగి రావాలంటే మరో ఏడాది పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ చట్టాలపై ప్రస్తుతం దేశంలో ఆందోళనలు, నిరసనలు చెలరేగుతున్నాయని, సంస్కరణలు అన్నవి సంప్రదింపుల ద్వారా చేపట్టాలి తప్ప నిరంకుశంగా కాదని ఆనంద్ చెప్పారు. ఏకాభిప్రాయం లేకుండా ఏ చట్టాన్ని హడావుడిగా తీసుకురాకూడదని ఆయన చెప్పారు. దాని ఫలితమే ఇప్పుడు చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. చర్చలు, సంప్రదింపులు, ఒప్పించడం ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని తాను వ్యక్తిగతంగా భావిస్తానని, రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇందులో నిమగ్నం చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని ఆయన సూచించారు. ఈ సంక్షోభాన్ని ఒక దేశంగా మనమంతా సమైక్యంగా పరిష్కరిద్దామని కూడా ఆయన పిలుపునిచ్చారు.
Centre to Resolve Farmers Agitation with dialogue: Anand Sharma