మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును మే 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 15 వరకు ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్సెట్లతో పాటు పిజిఇసెట్, పిఇసెట్, లాసెట్, పిజిఎల్ సెట్ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది.
లాక్డౌన్ ముగిసిన 3 వారాల తర్వాతనే ప్రవేశ పరీక్షలు
ఎంసెట్తో పాటు ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు ఇదివరకు మే 5వ తేదీ వరకు పొడిగించగా, తాజాగా దానిని మే 15 వరకు పొడిగించారు. రాష్ట్రంలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ పరీక్ష కేంద్రాల సామర్థం, ఏర్పాట్లకూ లాక్డౌన్ ముగిసిన తర్వాత కనీసం రెండు వారాల సమయం పడుతుంది. హాల్టిక్కెట్ల జారీకి మరో వారం కావాలి. దీంతో లాక్డౌన్ తర్వాత మూడు నుంచి నాలుగు వారాల అనంతరమే అంటే జూన్ రెండు లేదా మూడవ వారాల్లో ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితి నెలకొంది. సాధారణంగా జెఇఇ మెయిన్ పరీక్ష తర్వాతే రాష్ట్రంలో ఎంసెట్ను నిర్వహిస్తారు. మామూలుగా తెలంగాణ కంటే ఎపి ఎంసెట్ను వారం, పది రోజులు ముందుగా నిర్వహిస్తున్నారు. టిసిఎస్ అనుబంధ సంస్థ అయిన అయాన్ డిజిటల్ సైతం జెఇఇ మెయిన్ పూర్తయ్యాక మొదట ఎపి, తర్వాత తెలంగాణ ఎంసెట్ జరుపుతామని చెబుతున్నట్లు తెలిసింది. అంటే జూన్ రెండు, మూడవ వారాల్లో ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎంసెట్ ర్యాంకులు వెల్లడించాలంటే ఇంటర్ ఫలితాలు అవసరమైనందున జూన్లో పరీక్షలు జరిపినా విద్యాసంవత్సరం ఆలస్యం కాదు. ఏదైనా జాతీయ స్థాయి పరీక్షల తేదీలు వెల్లడయ్యాకనే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
CET 2020 Exam Application Date Extended in Telangana