Monday, April 29, 2024

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నామినేషన్ గల్లంతు ?!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి నామినేషన్ గల్లంతయ్యింది? అయితే ఆ నామినేషన్ గల్లంతయ్యిందా, లేదా? ఆయన నామినేషన్ వేయలేదా? అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉంటూ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నూరు అభ్యర్థిగా ఖరారయ్యారు. అయితే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు మిస్ అయినట్టుగా సమాచారం. చివరి నిమిషంలో పార్టీలో చేరినా ఆయనకు టికెట్ కేటాయించడంతో ఆయన గెలుపు కూడా తథ్యమన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. నామినేషన్ల గడువు శుక్రవారం ముగిసిపోగా, ఆయా సెగ్మెంట్‌లలో పోటీ చేస్తున్న మొత్తం 23 మంది అభ్యర్థుల పేర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం శనివారం వెల్లడించింది.

ఆ జాబితాలో గడ్డం వివేక్ పేరు కనిపించలేదు. దీంతో ఆయన నామినేషన్ వేశారా? వేయలేదా?.. దాఖలు చేసినా, ఎలక్షన్ కమిషన్ మర్చిపోయిందా?.. ఇలాంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. చెన్నూరు టికెట్ ఖరారవుతుందని తెలిసిన వెంటనే ఆయన కుమారుడు వంశీ అక్కడ బైక్ ర్యాలీ నిర్వహించారు. వివేక్ సైతం ప్రచారం చేస్తున్న సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగిసిపోయిన తర్వాత ఆయన పేరు మిస్సింగ్ కావడంతో ఇప్పుడేం చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది.

బిఆర్‌ఎస్ తరఫున బాల్క సుమన్, బిజెపి తరఫున దుర్గం అశోక్, బిఎస్పీ తరఫున దాసరపు శ్రీనివాస్, తెలంగాణ రాజ్య సమితి తరఫున వడ్లకొండ రాజం తదితరులతో పాటు మొత్తం 23 మంది పోటీ చేస్తున్నారు. అందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఏ అభ్యర్థి పేరు కనిపించలేదు. గడ్డం వివేక్ వెంకటస్వామి పేరు కూడా కనిపించలేదు. ఇంతకూ వివేక్ చెన్నూరు బరిలో ఉన్నట్టా? లేనట్టా?.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరు? నామినేషన్ల దాఖలులో వచ్చే సాంకేతిక సమస్యలతోనే అభ్యర్థులు రెండు, మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తుంటారు. అయినా అందులో కూడా వివేక్ పేరు లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News