నేల స్వభావం, మంచు, నీటి ఉనికిపై పరిశోధనలు
బీజింగ్: అంగారకుడిపై చైనా మొట్టమొదటి రోవర్ కదలడం ప్రారంభించింది. 240 కిలోల బరువున్న ఝురాంగ్ అనే రోవర్ అంగారకుడి ఇసుక నేలపై నెమ్మదిగా కదులుతోందని చైనా అంతరిక్ష సంస్థ సిఎన్ఎస్ఎ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 2020, జులై 23న అంగారకుడిపైకి చైనా తియాన్వెన్1 రోదసీనౌకను పంపింది. అందులో ఓ ఆర్బిటర్, ఓ ల్యాండర్, ఓ రోవర్ ఉన్నాయి. ఆర్బిటర్ అంగారకుడి కక్షలో తిరుగుతుంది. మే 15న ఆర్బిటర్ నుంచి విడిపడ్డ ల్యాండర్,రోవర్ అంగారకుడి నేలను తాకాయి. తాజాగా ల్యాండర్ నుంచి విడిపడ్డ రోవర్ అంగారకుడిపై కదులుతోందని సిఎన్ఎస్ఎ తెలిపింది. ఆరు చక్రాలతో కూడిన రోవర్ నీలి సీతాకోకచిలుకను తలపిస్తోందని సిఎన్ఎస్ఎ పేర్కొన్నది.
అంగారకుడిపై ఝురాంగ్ గంటకు 200 మీటర్ల వేగంతో కదులుతుంది. మూడు నెలలపాటు అంగారకుడిపై పరిశోధనలు జరుపుతుంది. ఉపరితలంపై నేలలోని మూలకాలు, అడుగున ఉన్న నేల నిర్మాణం, అయస్కాంత క్షేత్రం, మంచు,నీటి జాడలు, వాతావరణంలాంటి అంశాల్ని రోవర్లోని పరికరాలు పరిశీలిస్తాయని చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొన్నది. పరిశోధనకు సంబంధించిన హైరిజొల్యూషన్ త్రీ డైమెన్షియనల్ చిత్రాలను చైనా రోదసీ సంస్థకు చేరవేయనున్నదని తెలిపింది. ఆర్బిటర్(శాటిల్లైట్) మాత్రం అంగారకుడి కక్షలో ఒక అంగారక సంవత్సరం(భూమిపై 687 రోజులకు సమానం)పాటు తిరుగుతూ అక్కడి వాతావరణ విశేషాల్ని పంపిస్తుంది.