మెగాస్టార్ చిరంజీవికి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. చిన్న పిల్లలతో కలిసి తానూ చిన్న పిల్లాడిలా మారిపోతారాయన. చిన్న పిల్లలతో సరదాగా గడిపితే తనకు సమయమే తెలియదంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ పీరియడ్ని మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలితో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. ఓ పాట విషయంలో తాను ముందుకీ వెనక్కీ వెళ్లి మళ్లీ మొదటి నుంచి పాటను వింటూ ఎంజాయ్ చేస్తున్నానని చిరు ట్వీట్ చేశారు. ఆ పాట ఏంటో చెబుతానని చెప్పారు మెగాస్టార్. అభిమానులంతా ‘మగువా మగువా’ పాట గురించే చిరంజీవి చెబుతారేమోనని ఆశించారు.
దానికి కారణమూ లేకపోలేదు. ఈ మధ్యనే ‘బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్’లో భాగంగా తన తల్లికి పెసరట్టు స్వయంగా వేసిన చిరంజీవి… ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో వాడింది ‘మగువా మగువా’ పాటనే. అయితే చిరంజీవి అభిమానులకి పెద్ద షాకే ఇచ్చారు. ఈసారి తన సినిమా ‘ఖైదీ నెంబర్ 150’లోని ‘మి..మి..మి’ అంటూ సాగే పాట గురించి చెప్పారు. తన మనవరాలు నవిష్కకి బాగా ఇష్టమైన పాట అదేనంటూ ఓ క్యూట్ వీడియో షేర్ చేశారు. చిరంజీవి ఒళ్లో కూర్చున్న ఆ మనవరాలు ‘మి..మి..’ పాట గురించి అడగడం, చిరంజీవి సరదాగా వారించే ప్రయత్నం చేయడం… ఇదంతా బోల్డంత ఫన్ క్రియేట్ చేసింది. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి లాక్డౌన్ సమయాన్ని తన కుటుంబంతో పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. అభిమానులకు కూడా వినోదాన్ని పంచుతున్నారు.