న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకున్న వలసకూలీలు 40 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఓ వైపు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు లాక్ డౌన్ ను పొడిగించింది. దీంతో వలస కార్మికులు రోడ్ల వెంబడి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. మరికొంతమంది తమ ప్రాంతాలకు పంపించాలని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. వలస కార్మికులను ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో తరలించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, అసలే పనులు లేక.. ఉన్న పైసలన్నీ ఖర్చు చేసుకున్న వలస కార్మికుల నుంచి రైల్వే టికెట్ వసూల్ చేస్తుండడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. సంక్షోభ సమయంలో కూలీల నుంచి టికెట్ చార్జీలు వసూల్ చేయడం దారుణమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ విపత్కర సమయంలో వలస కూలీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వలస కూలీలకు రైల్ టికెట్ల ఖర్చును తామే భరిస్తామని సోనియా గాంధీ ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు అన్ని చర్యలు తీసుకుంటాయని ఆమె తెలిపారు.
లాక్డౌన్ సమయంలో కేవలం 4గంటల సమయం మాత్రమే ఇచ్చారని, దీంతో లక్షలాది మంది వలస కూలీలు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారని ఆమె ఆరోపించారు. అహ్మదాబాద్లో జరిగిన నమస్తే ట్రంప్ ఈవెంట్ కోసం పిఎం రిలీఫ్ ఫండ్కు రైల్వే శాఖ 151 కోట్లు ఇచ్చిందని.. కానీ, కూలీలను తరిలించేందుకు వారి నుంచి టికెట్ ఛార్జీలు వసూల్ చేయడం దారుణమని సోనియా గాంధీ మండిపడ్డారు.
Cong to bear rail travel cost of migrant workers: Sonia