మనతెలంగాణ/హైదరాబాద్ః నిత్యవసర సరుకులను తరలిస్తోన్న లారీ డ్రైవర్లు కరోనా బారిన పడటంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఎపి రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల ఎపిలోని కృష్ణా జిల్లా నూజివీడు నుంచి మామిడి పండ్లను ఓ లారీలో మహారాష్ట్రకు ఎగుమతి చేశారు. ఈ లోడ్ను తీసుకెళ్లిన లారీ డ్రైవర్కు మహారాష్ట్రలో కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు వచ్చే లోపే అతడు మామిడి పండ్లను అన్లోడ్ చేసి తిరిగి పయనం అయ్యాడు. కానీ ఆ లారీ డ్రైవర్కు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమ్తమైన మహారాష్ట్ర యంత్రాంగం సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. నిర్మల్ జిల్లా పోలీసుకు రిపోర్టులు పంపించింది. ఈ వ్యవహారం ఇంటెలిజెన్స్ దాకా వెళ్లింది. దీంతో నిర్మల్ జిల్లా పోలీసులు మహారాష్ట్ర సరిహద్దులోని బెల్తరోడా చెక్ పోస్టు వద్ద కాపుగాసి లారీ డ్రైవర్ను, అతడితోపాటు ఉన్న మరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లారీ డ్రైవర్లను ఇద్దరనీ గాంధీ హాస్పిటల్కు తరలించారు. లారీ డ్రైవర్కు కరోనా అని తేలడంతో ఏపీతోపాటు తెలంగాణ, మహారాష్ట్రల్లో అతడు ఎవరెవర్ని కలిశాడనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.
Corona affected Lorry Driver Rushed to Gandhi Hospital