Monday, April 29, 2024

కరోనా -మరో ప్రచ్ఛన్న యుద్ధ ఛాయలు

- Advertisement -
- Advertisement -

3693 New Corona Cases Reported in AP

విద్యార్థులను మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే ఆస్ట్రియా రాకుమారుడు ఫెర్డినాండ్ హత్య అని చెపుతారు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే పోలాండ్ పై హిట్లర్ (జర్మనీ) దాడి చేయటం అని చెపుతారు. ప్రచ్ఛన్న యుద్ధానికి కారణం అడిగితే రెండవ ప్రపంచయుద్ధం తరువాత ద్వి ధ్రువ ప్రపంచంలో అటు అమెరికా ఇటు రష్యా, ప్రపంచ ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు అని చెపుతారు. ప్రచ్ఛన్న యుద్ధం ఎలా ముగిసిందని అడిగితే యుఎస్‌ఎస్‌ఆర్ విచ్ఛిన్నం కావడం అని చెపుతారు. ఇప్పుడు మరో ప్రచ్ఛన్న యుద్ధం ఛాయలు ఎలా ఏర్పడుతున్నాయంటే కరోనా వైరస్ సృష్టిస్తున్న అగాధం వల్ల అని బహుశ చెప్పవచ్చు. ఇప్పుడు పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఆ విధంగానే ఉంది.

అమెరికా చైనా మధ్య 737.1 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఉన్నప్పటికీ దిగుమతి సుంకల పెంపు పేరిట వాణిజ్య యుద్ధం నడుస్తుంది. కరోనా వైరస్ వూహన్ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని,ఆ వైరస్ గురించి ప్రపంచానికి చైనా ఆలస్యంగా తెలియజేసిందని, అమెరికా చైనాపై ఆరోపణలు చేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తితో, దాన్ని కంట్రోల్ చేయలేక చైనాపై అమెరికాకున్న అక్కసునంతా ట్రంప్ స్వామి కార్యం (అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం) స్వకార్యం (అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఉన్నందున)లో భాగంగా వెళ్లగక్కుతున్నారు. ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి అమెరికా దేశ కంపెనీలు చైనాను వదిలిపెట్టాలని పరోక్షంగా ఆయా కంపెనీలపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు.

కరోనా వ్యాపిస్తున్న మొదట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఒ) చైనాకు అనుకూలంగా మాట్లాడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందే మొత్తం నిధులతో అమెరికా వాటా 22%గా ఉంది. గత సంవత్సరం అమెరికా 122.6 మిలియన్ డాలర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించింది. కరోనా విషయంలో గుర్రుగా ఉన్న అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చే నిధులలో సగానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ దేశాలు ఒకింత చైనాను అనుమానంతో చూస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వైఖరిని మార్చుకుని వైరస్ పుట్టుకపై నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

యూరోప్‌లో కరోనా వల్ల మొదట్లో ఎక్కువగా నష్టపోయిన దేశాలు స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ. ఆయా దేశాలకు చైనాతో గట్టి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. 2016లో యూరోపియన్ యూనియన్‌కు చైనాకు 514.8 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. యూరోపియన్ యూనియన్‌కు చైనా రెండవ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అయినప్పటికీ ఆయా దేశాలు చైనాపై ఎక్కువగా ఆధారపడకూడదనే వాస్తవాన్ని గ్రహించి అటువైపుగా అడుగులు వేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు ఎలాగో అమెరికా మిత్ర దేశాలు కాబట్టి అమెరికాతో గొంతు కలుపుతున్నాయి. ఆస్ట్రేలియాకు చైనాకు 214.672 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల వాణిజ్యం జరుగుతుంది. ఆస్ట్రేలియా దిగుమతుల్లో చైనా వాటా 32.6%, గా ఉంది. అయినప్పటికీ ఆస్ట్రేలియా చైనా మధ్య సుంకల పెంపుతో వాణిజ్య యుద్ధం నడుస్తుంది.

అగ్నికి వాయువు తోడైనట్లు వాణిజ్య యుద్ధానికి కరోనా వైరస్ తోడవ్వడంతో ఆస్ట్రేలియా చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వాతావరణం వేడెక్కింది. జపాన్, చైనా మధ్య 33.14 ట్రిలియన్ యోన్స్ వాణిజ్యంతో వాటి మధ్య సంబంధాలు బలంగానే ఉన్నప్పటికీ జపాన్, చైనా మధ్య సెంకాకు లేదా డియోయు (రెండు ఒక్కటే) దీవుల కోసం వివాదం ఉంది. అమెరికా సైన్యాలు జపాన్‌కు రక్షణగా జపాన్‌లో ఉన్నాయి. ఫిబ్రవరిలో చైనా నుంచి జపాన్ దిగుమతులు 47.1% కి తగ్గాయి. ఇప్పుడు కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పతనం కావడంతో దీనికి కారణం అంతా చైనా అన్నట్లు జపాన్ చైనా పై కోపంగా ఉంది.

కరోనా వైరస్ వల్ల వెంటనే ప్రభావితం అయిన దేశం దక్షిణ కొరియా. దక్షిణ కొరియా త్రి టీ ఫార్ములా ద్వారా కరోనాను నియంత్రించి బయటపడింది.కానీ చైనా మిత్రుడైన ఉత్తర కొరియా బెదిరింపులను దక్షిణ కొరియా ఎప్పుడూ ఎదుర్కొంటూనే ఉంది. కాబట్టి దక్షిణ కొరియా, అమెరికాకు చెందిన 28 వేల మంది సైనికుల సహాయాన్ని తీసుకుంటుంది. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్‌ను మోహరిస్తుండడం, హాంకాంకు మద్దతుగా దక్షిణ కొరియా ప్రజలు చైనా దౌత్య కార్యాలయం ముందు ర్యాలీ జరపడంతో రెండు దేశాల మధ్య ఘర్షణలు ఇంకా పెరిగాయి.

ఇండియా చైనా మధ్య సరిహద్దు సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నాయి. అయినప్పటికీ మోడీ ప్రధాన మంత్రి అయిన తరువాత ఇండో చైనా వాణిజ్యం ఐదు రెట్లు పెరిగింది. మనప్రధాని మోడీ ఇప్పటికే మూడు, నాలుగు సార్లు చైనాలో పర్యటించారు. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ భారత ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లోని అహ్మదాబాద్‌లో పర్యటించడం, మహబళేశ్వరంలో ఇద్దరు దేశాధినేతలు చేయి చేయి కలిపి తిరగడం జరిగింది. అయిన గాల్వాన్ లోయలో జూన్ 15న నిరాయుధులైన భారత సైనికుల పై దాడి చేయడం, భారత్ సైనికులు దీటుగా జవాబు ఇవ్వడంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తరువాత భారత్ దీటుగా స్పందించడం, ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తుండడంతో చైనా వెనక్కు తగ్గింది.

దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యల వల్ల వియత్నం, మలేషియా, ఫిలిపిన్స్, బ్రూనే, ఇండోనేషియా మొదలైన దేశాలు ఇబ్బందులకు గురి అవుతున్నాయి. ఆయా దేశాధినేతలు పరోక్షంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. చైనా స్పాట్లీ దీవులు, పారాసెల్ దీవులలో ద్వీప భవనాలను నిర్మిస్తుంది. ఈ సముద్రం గుండానే సంవత్సరానికి 3.37 ట్రిలియన్ల ప్రపంచ వాణిజ్యం నడుస్తుంది ఇది ప్రపంచ వాణిజ్యంలో ముడవ వంతు. చైనా వాణిజ్యంలో 39.5% ఈ సముద్రం గుండా నడుస్తుంది. తైవాన్, హాంకాంగ్, థాయిలాండ్ మరికొన్ని ఆగ్నేయాసియా దేశాల ప్రజలు మిల్క్ టీ ఆలయన్స్ పేరిట సోషల్ మీడియాలో చైనా పై విరుచుకుపడుతున్నారు. టిబెట్, తైవాన్ హాంకాంగ్ సమస్యలు ఎలాగో ఉన్నాయి. అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్, భారత్ కూడా మిత్ర దేశం కావడంతో భారత్ చైనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో ఇజ్రాయిల్ ఇండియాకు మద్దతుగా వస్తుంది అనే వార్తలు కూడా వచ్చాయి. సౌదీ అరేబియా, మరికొన్ని గల్ఫ్ దేశాలు ఎలాగో అమెరికాకు మిత్ర దేశాలు.

ఇదంతా ఒక వైపు ఉంటే మరొక వైపు చైనా ప్రపంచంపై పట్టు సాధించాలనే లక్ష్యంతో అమెరికాపై పైచెయ్యి కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉంది. ప్రయత్నపూర్వకంగా గాని లేక అప్రయత్నంగా కానీ కరోనా వైరస్ వూహన్ నగరం నుంచి బయటి ప్రపంచానికి వ్యాప్తి చెందింది. దీనిలో చైనా తప్పు ఉందో లేదో చెప్పలేం కానీ చాలా దేశాలు చైనాను దోషిగా చూస్తున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు చైనా సప్లయ్ చైన్‌పై ఆధారపడడంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టమే వాటిల్లింది. ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతున్న ఈ సందర్భంగా అటు ప్రపంచ దృష్టిని, ఇటు తన ప్రజల దృష్టిని మళ్లించుటకు చైనా భారతదేశ సరిహద్దుల్లోకి చొచ్చుకొని వచ్చి యుద్ధ మేఘాలను సృష్టించింది.

చైనా, భారత్‌ను ఇరుకున పెట్టడానికి సుదీర్ఘ కాలంగా భారత్ కు మిత్రదేశంగా ఉన్న నేపాల్‌ను భారతదేశం పైకి ఎగదోస్తున్నట్లు కనిపిస్తుంది. చైనా ఉచ్చులో పడ్డ నేపాల్, భారత్ పై కయ్యానికి సిద్ధపడుతూ, భారత భూభాగలైన కాలాపాని, లింపియదుర, లిపులేక్ లను తన భాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్‌ను విడుదల చేయటం, రాముడు భారత అయోధ్య రాముడు కాడని, నేపాల్ అయోధ్య రాముడు అని ప్రకటనలు చేస్తుంది. పాకిస్థాన్ ఎలాగో చైనా మిత్రదేశం కావడంతో ఆక్రమిత కాశ్మీర్‌లో జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు చేపడుతూ కయ్యానికి కాలు దువ్వుతున్నది. ఈ కరోనా సందర్భంగా చోటు చేసుకుంటున్న మరొక కొత్త విషయం అమెరికాకు శత్రుదేశం, భారత్‌కు మిత్ర దేశమైన ఇరాన్ చైనాతో 400 బిలియన్ డాలర్ల ఆర్థిక, భద్రతా ఒప్పందం చేసుకోవడం.

దీనితో భారత్ చేపట్టిన చాబహర్ ఓడరేవు ప్రాజెక్టు భవిష్యత్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పటి నుంచో చైనా మిత్ర దేశం ఉత్తర కొరియా. ఉత్తర కొరియా చైనా మధ్య వాణిజ్యం గత కొంతకాలంగా పది రేట్లకు పెరిగింది. 2018 లో రెండు సార్లు 2019 లో రెండు సార్లు చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ఉత్తర కొరియను సందర్శించారు. ఉత్తరకొరియా అధ్యక్షునికి ఆరోగ్య సమస్యలు ఎదురైతే ప్రత్యేక వైద్య బృందాన్ని పంపి తన మిత్ర ధర్మాన్ని చాటుకుంది చైనా. ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ప్రధాన ప్రత్యర్థి అయిన రష్యా ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా చైనాతో సహకరిస్తున్నట్లు కనిపిస్తుంది. 2019 నాటికి రెండు దేశాలకు అమెరికాతో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. 2016 లో రష్యా చైనా మధ్య వాణిజ్యం 66.1 బిలియన్ డాలర్లుగా ఉంది .2020 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 200 బిలియన్ దాలర్లకు పెంచాలని నిర్ణయించారు.

ఈ విధంగా 1991 సంవత్సరం తరువాత ఏర్పడ్డ ఏకధ్రువ ప్రపంచంలోకి చైనా రూపంలో అమెరికాకు గట్టి పోటీ ఏర్పడి, ద్వి ధ్రువ ప్రపంచం ఏర్పడుతున్న ఈ సందర్భంలో కరోనా వైరస్ అమెరికా, చైనా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఒక వైపు అమెరికా దాని మిత్రదేశాలు అయినా బ్రిటన్ ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ యూరోపియన్ యూనియన్‌లోని మరికొన్ని దేశాలు, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, ఇండియా, ఇజ్రాయెల్, ఆగ్నేయాసిలోని కొన్ని దేశాలు, ఇంకోవైపు చైనా దాని మిత్రదేశాలు అయిన ఉత్తరకొరియా, పాకిస్తాన్, ఇరాన్, కొంత వరకు రష్యా, చైనాకు వంతపాడే మరికొన్ని దేశాలు పరస్పర విరుద్ధమైన చర్యలతో మరో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.

 

జుర్రు నారాయణ
9494019270

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News