హైదరాబాద్: గూగుల్ సంస్థ ప్రతినిధులతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గచ్చిబౌలిలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సమావేశమయ్యారు. గూగుల్ సంస్థ ప్రాడక్ట్ అండ్ లిటిగేషన్ కౌన్సిల్(నోడల్ ఆఫీసర్) గీతాంజలి దుగ్గల్, సునీత మెహంతి, దీపక్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ మాట్లాడుతూ సైబర్ నేరస్థులు గూగుల్లో నకిలీ యాడ్స్ ఇస్తూ చాలామంది ఆమాయకులను మోసం చేస్తున్నారని తెలిపారు. వివిధ కంపెనీల కాల్ సెంటర్ల నంబర్ల పేరుతో వారి మొబైల్ నంబర్లు పెట్టి మోసం చేస్తున్నారని అన్నారు.
అసభ్య వీడియోలు, చిత్రాలు యూట్యూబ్ నుంచి తొలగించడం, ఐపి అడ్రస్లు, మేయిల్ వివరాలు, యూట్యూబ్ ఛానల్ వివరాలు అందజేయాలని కోరారు. గూగుల్ తీసుకోవాల్సి చర్యల గురించి చెప్పారు. సైబర్ నేరస్థులు గూగుల్ను ఉపయోగించుకుని మోసం చేయకుండా టెక్నికల్ టీం చర్యలు తీసుకోవాలని కోరారు. కేసుల దర్యాప్తులో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. గూగుల్ టీం సభ్యులు కేసుల దర్యాప్తులో వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. గూగుల్ ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని, ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో క్రైం డిసిపి రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైం ఎసిపి శ్యాంబాబు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.