Monday, April 29, 2024

బాలానగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వారం సంత రోజు కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో 6 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవగా బైక్ పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకోవడం బాధాకరం. సంత రోజు కావడంతో అక్కడ చౌరస్తాలో పోలీసు సిబ్బంది కూడా పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు.

మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు చెప్పారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో ఈ హృదయ విదారక దృశ్యాలు చూసి స్థానికులు బోరున విలపిస్తున్నారు డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్తుండగా నడి చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీకొన్నట్టు స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదేవిధంగా బైక్ పై మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కూడా చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శవాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News