కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే నామినేషన్ దాఖలు
బెంగళూరు : ఈనెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరి లోకి కర్నాటక నుంచి జెడిఎస్ అగ్రనేత, మాజీ ప్రధాని దేవెగౌడ దిగనున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ వేస్తారని ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి చెప్పారు. రాజ్యసభకు పోటీకి ఆయనను ఒప్పించడం అంత సులువు కాకపోయినప్పటికీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు, అనేక జాతీయ స్థాయి నేతలు, పార్టీ ఎమ్ఎల్ఎలు అభ్యర్థించడంతో బరిలోకి దిగడానికి ఆయన నిర్ణయించారని కుమారస్వామి చెప్పారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సిద్దారామయ్య, తదితరులు ఉన్నారు. కర్నాటక నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు జూన్ 25 నాటికి ఖాళీ కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈనెల 9 వరకు గడువు ఉంది.
బిజెపి అభ్యర్థులు
కర్నాటక నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బిజెపి సోమవారం ప్రకటించింది. ఎర్రన్న కడాడి, అశోక్ గస్తీ పేర్లను వెల్లడించింది. వీరిద్దరూ రాష్ట్రీయ స్వయం సేవక్తో సంబంధం ఉన్న నేతలే. కర్నాటక బిజెపి విభాగం సిఫారసు చేసిన పేర్లను పక్కన పెట్టి అధిష్టానం వీరి పేర్లను నిర్ణయించడం గమనార్హం.