ఎంబిఎస్ జ్యువెల్లరీస్పై ఇడి
కొరడా ఫెమా నిబంధనలు
ఉల్లంఘిస్తూ హాంకాంగ్కు
భారీగా వజ్రాల ఎగుమతి
ఇంత భారీ జరిమానా ఇడి
చరిత్రలో తొలిసారి
మనతెలంగాణ/హైదరాబాద్: ఎంబిఎస్ జ్యూవెలర్స్ సంస్థ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రూ.222 కోట్ల 40 లక్షల భారీ జరిమానా విధించారు. ఈక్రమంలో ఎంబిఎస్ జ్యూవెలర్స్కు రూ.222 కోట్ల 40లక్షల భారీ జరిమానా విధించడం ఇడి చరిత్రలో ఇదే అత్యధిక జరిమానా అని అధికారులు వివరించారు. అలాగే ఎంబిఎస్ డైరెక్టర్ సుఖేశ్ గుప్తాకు ఇడి రూ.22కోట్ల జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా హాంగ్కాంగ్కు వజ్రాలు ఎగుమతి చేసిన కేసులో ఎంబిఎస్ జ్యూవెలర్స్పై ఇడి జరిమానా విధించింది. కాగా సుఖేశ్ గుప్తాపై ఇదివరకే రూ.216 కోట్ల లావాదేవీల్లో కేసు నడుస్తోందని ఇడి అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి హాంగ్కాంగ్కు వజ్రాలు ఎగుమతి చేసిన కేసులోనూ నిందితుడిగా ఉన్నారని పేర్కొన్నారు.
2013లో హాంగ్కాంగ్కు చెందిన లింక్ ఫై లిమిటెడ్ కంపెనీకి రూ.220 కోట్లు విలువ చేసే వజ్రాలను విక్రయించారని,దానికి సంబంధించిన సొమ్ము రావాల్సి ఉందని సుఖేశ్ గుప్తా వెల్లడించినట్లు ఇడి అధికారులు తెలిపారు. ఈక్రమంలో లింక్ ఫై కంపెనీతో సుఖేష్ గుప్తాకు గల సంబంధాలపై ఇడి అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. హాంకాంగ్కు డైమండ్ ఎక్స్పోర్ట్ చేసిన విషయం పై ఇడి ఫెమా కేసు నమోదు చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశీ ట్రాన్సాక్షన్లు జరపడంతోపాటు హాంకాంగ్కు డైమండ్ ఎక్స్పోర్ట్ లో హవాలా ద్వారా పెద్ద ఎత్తున నిధుల మార్పిడి జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. అంతే కాక కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా హాంకాంగ్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం డైమండ్ బిజినెస్ చేయడాన్ని ఇడి తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఇడి ఫెమా కేసు నమోదు చేసి విచారణ జరిపి అరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించడం నేపథ్యంలో సుఖేష్ గుప్తా తో పాటు ఎంబిఎస్ జ్యువలరీపైన భారీ జరిమానా విధిస్తూ ఇడి ఆదేశాలు జారీ చేసింది.