బీహార్లో ముగిసిన రెండోదశ పోలింగ్
94 స్థానాల్లో 54.15 శాతం ఓటింగ్
మధ్యప్రదేశ్లో 66.37, నాగాల్యాండ్లో 83.69 శాతం ఓటింగ్
న్యూఢిల్లీ: బీహార్లో మంగళవారం నిర్వహించిన రెండో దశ పోలింగ్లో 54.15 శాతంమంది తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. 2015 ఎన్నికల పోలింగ్తో (56.9శాతం) పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గింది. రెండో దశలో 94 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇప్పుడు పోలింగ్ జరిగిన ఉత్తర బీహార్ను బిజెపికి పట్టున్న ప్రాంతంగా భావిస్తారు. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ పోటీ చేసిన రాఘవ్పూర్, ఆయన సోదరుడు తేజ్ప్రతాప్ యాదవ్ పోటీ చేసిన హాసన్పూర్ స్థానాలు కూడా వీటిలో ఉన్నాయి. మొదటి దశలో 71స్థానాలకు పోలింగ్ జరగగా 54,26 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో 54.90 శాతం పోలయ్యాయి. చివరి దశలో 78 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనున్నది. ఫలితాలు ఈ నెల 10న వెల్లడి కానున్నాయి.
మరోవైపు పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మధ్యప్రదేశ్లో 28, గుజరాత్లో 8, ఉత్తర్ప్రదేశ్లో 7, జార్ఖండ్, కర్నాటక, నాగాల్యాండ్, ఒడిషాల్లో రెండేసి స్థానాలకు.. ఛత్తీస్గఢ్, హర్యానా, తెలంగాణల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లో రెండు కేంద్రాల వద్ద కాల్పుల ఘటనలు జరగడంతో పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. నాగాల్యాండ్, తెలంగాణల్లో 80 శాతంకుపైగా పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్లో 66.37 శాతం, గుజరాత్లో 57.98 శాతం, కర్నాటకలో 51.3 శాతం, ఉత్తర్ప్రదేశ్లో 51.57 శాతం, హర్యానాలో 68 శాతం, ఛత్తీస్గఢ్లో 71.99 శాతం,జార్ఖండ్లో 62.51 శాతం, ఒడిషాలో 68.08 శాతం, నాగాల్యాండ్లో 83.69 శాతం, తెలంగాణలోని దుబ్బాకలో 81.44 శాతం పోలింగ్ నమోదైంది.
54 per cent voting in 2nd Phase Polls of Bihar