Monday, April 29, 2024

ఓర్వలేకనే నాపై తప్పుడు ప్రచారం

- Advertisement -
- Advertisement -

అది క్షుద్ర పూజ కాదు…గిరిజన పూజ
ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొన్నాను
జీఎస్సాఆర్ ట్రస్ట్‌ను ఏర్పాటు
చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నా
ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు
రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్‌గా ఉన్నా..
రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏం ఉన్నది
డీహెచ్ డాక్టర్ జి. శ్రీనివాసరావు

False propaganda against me

మనతెలంగాణ/హైదరాబాద్ : తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బురద జల్లే వ్యక్తుల మాటలను ప్రజలు విశ్వసించాల్సిన అవసరం లేదని అన్నారు. బుధవారం కొన్ని ఛానెళ్లలో ప్రసారమైన వార్తలను డీహెచ్ ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు, మీడియా ప్రతినిధులు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని డీహెచ్ ప్రశ్నించారు. స్థానికుల ఆహ్వానంతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. స్వయం ప్రకటిత దేవతతో సంబంధం లేదని అన్నారు.

తాను మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనని స్పష్టం చేశారు. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. తన తండ్రి స్పూర్తితో జీఎస్సాఆర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా సామజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. మానసిక ప్రశాంతత కోసం సెలవుల్లో సొంత గ్రామానికి కరోనా నియంత్రణలో రెండున్నర ఏళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన తాను మానసిక ప్రశాంతత కోసం హాలిడేస్‌లో సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నట్లు డీహెచ్ చెప్పారు. కానీ ఎక్కువ సార్లు వచ్చారంటూ చర్చించుకోవడంలో అర్థం లేదన్నారు.

కరోనాకు ముందు కూడా ఎన్నోసార్లు కొత్తగూడెం ప్రాంతానికి వస్తూ ఉండేవాడినని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాస్త బయట ఎక్కువగా తిరుగుతున్నానని వివరించారు. కానీ స్వార్ధపూరిత వ్యక్తులు జీర్ణించుకోలేక తనపై బురద జల్లుతున్నారని విమర్శించారు. వాళ్లకు కనువిప్పు కలిగే రోజు వస్తుందని చెప్పారు. రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న తనకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏం ఉన్నదని ప్రశ్నించారు. మెగా హెల్త్ క్యాంపు ఏర్పాట్లలో భాగంలోనే గత కొంత కాలంగా కొత్తగూడెం ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు వివరించారు. విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టానని అన్నారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్లు చేపించామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. పేదలకు మేలు జరగడం కోసం తాను చేసే సేవా కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News