వరుసగా రెండో నెల లక్ష కోట్లు దాటిన జిఎస్టి ఆదాయం
న్యూఢిల్లీ : వరుసగా రెండో నెలలోనూ జిఎస్టి (వస్తు, సేవల పన్ను) ఆదాయం రూ.లక్ష కోట్లను దాటింది. నవంబర్లో జిఎస్టి వసూళ్లు రూ.1.04 లక్షల కోట్లు వచ్చాయి. లాక్డౌన్ ఆంక్షలను నెమ్మదిగా సడలిస్తూ వస్తుండడంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. వస్తువులు విక్రయం, సేవల నుంచి పన్ను వసూళ్లు ఈసారి పెరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకారం, గతేడాదితో పోలిస్తే నవంబర్లో 1,04,963 కోట్ల జిఎస్టి వసూళ్లు ఉన్నాయి. గతేడాది (2019) ఇదే సమయంలో ఈ వసూళ్లు రూ.1.03 లక్షల కోట్లు నమోదయ్యాయి. అయితే 2020 అక్టోబర్లో జిఎస్టి వసూళ్లతో పోలిస్తే నవంబర్లో రూ.192 కోట్లు తక్కువగా ఉన్నాయి. జిఎస్టి వసూళ్లు దేశీయ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని ప్రతిబింబిస్తాయి.
కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన తర్వాత ఏప్రిల్లో అతి తక్కువగా రూ.32,172 కోట్ల జిఎస్టి వసూళ్లు వచ్చాయి. లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వస్తుండడంతో జిఎస్టి వసూళ్లు పెరిగాయి. ఈ సంవత్సరంలో మొదటిసారిగా జిఎస్టి వసూళ్లు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కీలక రూ.1 లక్ష కోట్ల మార్క్ను దాటాయి. వరుసగా రెండో నెల నవంబర్లోనూ జిఎస్టి ఆదాయం రూ.లక్ష కోట్లు అధిగమించింది. ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు అన్నమాట. నవంబర్లో జిఎస్టి వసూళ్లలో వార్షిక వృద్ధి 1.4 శాతం ఉంది. అలాగే అక్టోబర్, సెప్టెంబర్ నెలల్లో వరుసగా 10 శాతం, 4 శాతం వృద్ధి నమోదైంది.