ముంబయి: బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్(34) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ముంబయిలోని తన ఇంట్లో ఉరివేసుకుని సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోనీ బయోపిక్లో సుశాంత్ హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో టివి సిరియల్స్తో తన కెరీర్ ప్రారంభించిన సుశాంత్.. ‘కాయ్ పో చీ’ సినిమాతో వెండితెరకు పరిచమయ్యాడు. ఆ తర్వాత ‘పీకే’, ‘రబ్తా’, ‘కేదార్నాథ్’ వంటి సినిమాలు చేశాడు.
ఇటీవల సుశాంత్ సింగ్, శ్రద్ధకపూర్లు కలిసి నటించిన ‘చిచ్చోరే‘ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘దిల్ బెచరా’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇంతలోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం సినీ ప్రముఖులతోపాటు ఆయన అభిమానులకు షాక్ కు గురిచేసింది. కాగా, నాలుగు రోజుల క్రితం సుశాంత్ సింగ్ మేనేజర్ దిశా సలియా కూడా ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్ కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నట్లు తెలుస్తోంది.
Hero Sushant Singh Rajput commits suicide at Mumbai