హైదరాబాద్: రెండు హిజ్రాల వర్గాల మధ్య నెలకొన్న గొడవలతో మనస్థాపం చెందిన ఓ హిజ్రా ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన హిజ్రా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని ఎర్రగడ్డ, అవంతినగర్కు చెందిన హరిప్రసాద్ అలియాస్ హంస (28) ఇటీవల చందానగర్లో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉంటున్న సమీర, మోక్ష, లాస్య, సుధా హిజ్రాలతో విభేదాలు తలెత్తాయి. ఇరువురు వేర్వేరు వర్గాలు కావడంతో గొడవలు ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలోనే హైటెక్ సిటీ సమీపంలో మాట్లాడుకుందామని వేరే వర్గం సమాచారం ఇవ్వడంతో హంస వెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న హంస వ్యతిరేఖ వర్గంతో గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన హంస ఒక్కసారిగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మిగతా వారు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు తీవ్రంగా గాయపడిన హంసను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. హంస పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.