Sunday, April 28, 2024

పర్యావరణ మార్పులు భారత్ ఆహార భద్రత

- Advertisement -
- Advertisement -

మనకు మనం కోరి తెచ్చుకున్న జీవన నడవడిక మన చుట్టూవున్న పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. భవిష్యత్తులో మనం తినే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు కరవురానుంది. ఈ విషయంలో ఇప్పటికే మన కండ్ల ముందు కనపడుతున్న పర్యావరణ అసమతుల్యత మన పంటల దిగుబడులను గణనీయంగా తగ్గించివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు, వినియోగదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రానున్న రోజుల్లో ఆహార భద్రతకు పెనుముప్పు రానుందని మన పార్లమెంటరీ స్థాయి సంఘం ఆరేళ్ల క్రితమే ప్రభుత్వానికి హెచ్చరిక కూడా జారీ చేసింది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో హెచ్చుతగ్గుల అసమతుల్యత దేశంలో కరవుకు ఆహ్వానం పలకనుంది. మనం పర్యావరణ పరిస్థితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే లేదా ఎప్పటికప్పుడు సమస్యను వాయిదా వేస్తూపోతే భవిష్యత్తు అంధకారంగా మిగులుతుంది. దీని మూలం గా రానున్న భవిష్యత్తరాలు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.

ముఖ్యంగా ప్రపంచంలోనే 140 కోట్ల అధిక జనభాగల భారతదేశం ఆహారకొరతతో అలమటించే పరిస్థితులు రానున్నాయి.ఈ పరిస్థితులను ఊహిస్తూ భారత వ్యవసాయ పరిశోధన మండలి, సంబంధిత శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ భారత వ్యవసాయ పరిశోధన విద్యా విభాగం కార్యదర్శి డాక్టర్ హిమాన్షు పాఠక్ తాజాగా గణాంక వివరాలతో నివేదికను ప్రభుత్వానికి అందజేశాడు.వాతావరణంలో ఊహాతీత పరివర్తనల మూలంగా 2080నాటికి ముఖ్యంగా వర్షాధార పంటలైన వరి, గోధుమ, చెరకుదిగుబడిలో ఏకంగా 40% నుంచి 45% తరుగుదల నమోదు కానునట్లు డాక్టర్ పాటక్ ఆందోళన వ్యక్తం చేశాడు. మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంటలు కూడా సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయి. కేవలం పంటల దిగుబడులు తగ్గిపోవటమే కాకుండా పండిన పంటల్లో పోషక విలువల నాణ్యత కూడా పర్యావరణ మార్పుల మూలంగా క్రమంగా క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా 109 జిల్లాల్లో వ్యవసాయం అత్యంత తీవ్రస్థాయి సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని అంచనా వేశారు.

దీని తీవ్రత మున్ముందు 201 జిల్లాలకు విస్తరించే ముప్పుకూడా కనపడుతున్నదని నిపుణుల సంఘం అంచనా వేసింది. మన దేశంలో స్థానికంగా సుమారు 60 శాతం సాగుభూమి వర్షాధారంపై ఆధారపడినవే. ఆయా ప్రాంతాల్లో పంటల దిగుబడి తగ్గిపోతే భారత గ్రామీణార్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. దేశ వ్యాప్తంగా ఆహార భద్రత లోపిస్తుంది. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీని కారణంగానే 2021లో దేశీయ తయారీ, సేవ, వ్యవసాయ, నిర్మాణ రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సుమారు 15,900 కోట్ల డాలర్లను (జిడిపిలో దాదాపు 5.4 శాతం) నష్టపోయినట్లు ఇటీవల ఒక అధ్యయనం లెక్కగట్టింది. తుపానులు, ఆకస్మిక వరదలు, కొండచెరియలు కూలిపడటం వంటి సంఘటనల వల్ల 2015 2022 మధ్య ఇండియాలో 8.89 కోట్ల ఎకరాల్లో పంటలు పాడైనట్టు అంచనా వేశారు. అలాగే గడిచిన మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా వర్షపాతం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. వరదలు, తుపానులు విధ్వంసకరంగా పరిణమిస్తున్నాయి. రుతు పవనాలు గతి తప్పుతున్నాయి. దానితో కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

సుమారు ఏడున్నర వేల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, అత్యధిక జనసాంద్రత వల్ల ప్రకృతి వైపరీత్యాల, ప్రతికూల ప్రభావానికి భారత దేశం గురికానునట్లు ఐక్యరాజ్యసమితి అంతర్ ప్రభుత్వాల కమిటీ నివేదికలో వెల్లడించింది. భూమి ఊష్ణోగ్రత పెరగడానికి ముఖ్యకారణం శిలాజ ఇంధనాలు మండించటమే. అధిక రసాయన ఎరువులు, పురుగుమందులు భూగర్భాన్ని విషపూరితం చేస్తున్నాయి. తీర ప్రాంత ఫ్యాక్టరీల రసాయనిక వ్యర్ధాలు నీటిని కలుషితం చేస్తున్నాయి. ప్రణాళికా రహితంగా విస్తరిస్తున్న పట్టణాలు, అడవుల నరికివేతలతో పరిస్థితులను మరింత దిగజార్చుతున్నాయి. సత్వర అభివృద్ధి కోసం చేపట్టే కార్యకలాపాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని కేంద్ర,- రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఈ విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం గత జనవరి నెలలో పలు సూచనలు చేసింది. సుస్థిరాభివృద్ధికి ప్రకృతి పరిరక్షణ మధ్య సంఘర్షణ, వైరుధ్యం ఎప్పుడూ ఉంటుంది. అయితే వీటిమధ్య హేతుబద్ధమైన సమతుల్యతను సాధించడమే విజ్ఞుల పని అని హితవు పలికింది. ఆ మేరకు పాలకులు జాగ్రత్త వహించాలి. దీనితో పాటు -2070 నాటికి ‘నెట్ జీరో’ (కార్బన్ ఉద్గారాల తటస్థత) ను సాధిస్తామని అంతర్జాతీయ సమాజానికి చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలి.

అందుకుగాను దీర్ఘకాలిక వ్యూహాలతో ప్రణాళికల రూపకల్పన జరగాలి. పెట్రోల్, డీజిల్ మొదలైన ఇంధనాలు పొదుపుగా వాడాలి. ప్రజా రవాణాలో పర్యావరణ హితమైన సోలార్ ఎనర్జీని విరివిగా వాడాలి. ఇతర నూతన మార్గాలను అన్వేషించాలి. పట్టణాల విస్తరణ వల్ల కలిగే పర్యావరణ సమస్యలను ప్రణాళికాబద్ధంగా ఎదుర్కోవాలి. పారిశ్రామిక వ్యర్ధాలు జలవనరులను నాశనం కాకుండా చూడాలి. అడవులను రక్షించటంతోపాటు జనాభా నిష్పత్తికి తగినట్లు 33% అడవులను పెంచాలి. విస్తారంగా పట్టణాలు, పల్లెలు, రహదారులు, ఖాళీ మైదానాలలో మొక్కలు నాటాలి. మన చుట్టూ వున్న పరిసరాలలో శుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు లభించేలా కేంద్ర-, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పర్యావరణ హితమైన చర్యలనుచేపట్టాలి. మరొక వైపు ప్రపంచ వనరులను అందరి కంటే ఎక్కువగా కొల్లగొట్టేది, పర్యావరణానికి ఎక్కవ ముప్పు తెచ్చేది, పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలే దీనికి కారణం. కాని అవి కేవలం ప్రపంచానికి నీతులు బాగా చెబుతాయి. బాధ్యత మాత్రం తీసుకోవు. నిధులు కూడా సరిగ్గా విడుదల చేయవు.

నిజానికి పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలే ప్రపంచ పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు చేపట్టాలి. ఈ దేశాలే – కర్బన ఉద్గారాలను విచ్చలవిడిగా వెదజల్లుతున్నాయి. ‘ఇ- వేస్ట్’ను ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు షిప్పులలో తరలిస్తుంది. పైగా ‘క్యాప్’ విశ్వసదస్సులో అవి చేసే ప్రతిజ్ఞలు, వాగ్దానాలు నీటిపై రాతలే అవుతున్నాయి. భూతాపాన్ని తగ్గించడంలో సంపన్న రాజ్యాలు నిజంగా సహకారం, సహాయం అందించినప్పుడే వాతావరణ మార్పుల విష వలయంలోంచి మానవాళి తెప్పరిల్లగలుగుతుంది. ధనిక దేశాలు ప్రపంచ ఆధిపత్యం కోసం చేసే యుద్ధాలు, ఆయుధ కాలుష్యం, అవి చేసే జీవశాస్త్ర పరిశోధనలు కూడా ప్రపంచ పర్యావరణానికి ముప్పు తెస్తున్నాయి. ఈ విషయంలో బడుగు దేశాలు ఐక్యరాజ్య సమితిలో తమ గోడు వెళ్ళబోసుకుందామంటే వినేనాథుడు లేడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News