20 మందికి పైగా అరెస్టు.. 5న పాక్ సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: కరక్ జిల్లాలోని ఖైబర్ పఖ్తూన్క్వాలో ఇటీవల ఒక హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై పాకిస్తాన్కు భారత ప్రభుత్వం సూత్రప్రాయంగా తన నిరసన తెలియచేసింది. దీనిపై పాకిస్తాన్కు అధికారికంగా నిరసన తెలియచేసే ప్రక్రియ జరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలియచేశాయి. కరక్ పట్టణంలోని తెరి గ్రామంలోగల కృష్ణ ద్వార మందిరంతోపాటు శ్రీ పరమహంసజీ మహరాజ్ సమాధిని కొందరు మూకలు గత బుధవారం ధ్వంసం చేశారు. ఆలయ నిర్వాహకులు తమకు చెందిన స్థలానికి అదనంగా మరికొంత స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ మూకలు ఆలయానికి నిప్పుపెట్టాయి. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే రాత్రికిరాత్రి పోలీసులు గాలింపులు జరిపి దాదాపు రెండు డజన్లమందిని అరెస్టు చేశారు. ఆలయంపై దాదాపు 1500 మంది దాడి జరిపినట్లు వార్తలు వచ్చాయి.
తెరి గ్రామంలో ఆలయంపై దాడి జరిగిన ఘటనను గురువారం పాకిస్తాన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ తనకు తానుగా విచరణకు స్వీకరించి నోటీసులు జారీచేయడంతో అరెస్టులు జరిగాయి. గురువారం కరాచీలో చీఫ్ జస్టిస్ను కలుసుకున్న మైనారిటీలకు చెందిన పార్లమెంట్ సభ్యుడు రమేశ్ కుమార్ ఆలయాన్ని తగులబెట్టిన ఘటనపై సమాచారం అందచేశారు. ఈ కేసుపై జనవరి 5న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నది. కాగా.. ఆలయంపై దాడిని పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రి నూరుల్ హఖ్ ఖాద్రి ఖండించారు. ఇది మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా అభివర్ణిస్తూ ఆయన ట్వీట్ చేశారు. మైనారిటీల మత స్వేచ్ఛను పరిరక్షించడం తమ మత, రాజ్యాంగపర, నైతిక, జాతీయ బాధ్యతగా ఆయన పేర్కొన్నారు.
India protests Pakistan over temple demolition