పాకిస్థాన్కు 70 ఏళ్ల అపకీర్తి కిరీటం.. ఐరాస వేదికగా ఇండియా ఫైర్
న్యూయార్క్: ఉగ్రవాదం, రహస్య అణు వ్యాపారపు బేహారీతనం పాకిస్థాన్కు 70 ఏళ్లుగా వెలుగొందుతున్న కీర్తికీరిటం అయిందని భారతదేశం చురకలు పెట్టింది. 70 ఏళ్ల ఆ దేశ చరిత్రకు ఇంతకు మించిన ఘనత ఏదీ లేదని ఇక్కడ జరుగుతోన్న ఐరాస సర్వప్రతినిధి సభలో భారత శాశ్వత ప్రతినిధి బృందపు సీనియర్ సభ్యులు మిజితో వినితో తెలిపారు. సీమాంతర ఉగ్రవాద రవాణా, గుట్టుచప్పుడు కాకుండా అణ్వాయుధాల లావాదేవీలతో పాటు ఈ దేశంలో మైనార్టీ తెగల ఊచకోతల పర్వం కూడా సాగుతోందని భారత్ ఐరాస వేదిక నుంచి విమర్శల ఉధృతిని తీవ్రతరం చేసింది. మెజార్టీ ప్రజలతో కూడిన ఛాందసవాదాన్ని ఏళ్ల తరబడి పెంచిపోషిస్తూ వస్తున్నారని కూడా ప్రతినిధి బృందం దాడికి దిగింది. ఐరాస్ జనరల్ అసెంబ్లీ వేదిక నుంచి భారత్ పాకిస్థాన్ల మధ్య పలు కీలక అంశాలపై పరస్పర విమర్శల పర్వం సాగుతోంది.
ఈ క్రమంలోనే పొరుగుదేశపు వైఖరిని దునుమాడుతూ ఇండియా బృందం విమర్శలకుదిగింది. ఓ వైపు విద్వేషాలు, అసహనాలతో రగిలే దేశం భారత్కు నీతులు చెప్పడం, ఈ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ వేదిక నుంచి అదేపనిగా విషం చిమ్మడంపై భారత్ విమర్శల శతఘ్నులు చిమ్మింది. జనరల్ అసెంబ్లీకి ఇమ్రాన్ఖాన్ ఇటీవలే ముందుగా రూపొందించిన వీడియో సందేశం పంపించారు. ఇందులో ఆయన మాటలు పూర్తిస్థాయిలో భారతదేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడంగా మారాయని ప్రతినిధి బృందం మండిపడింది. ఖాన్ వీడియో సందేశం వెలువడుతున్నప్పుడు ఐరాస సభ వేదిక నుంచి ఇండియా ప్రతినిధి నిరసనగా సభ నుంచి వాకౌట్ జరిపారు. ఇండియా పట్ల పాకిస్థాన్ విషద్వేషపు వైఖరి సశేషానికి తమ ఆగ్రహం ఈ విధంగా వ్యక్తం చేస్తున్నట్లు తెలిపిన ఇండియా ప్రతినిధి ఇప్పుడు ఖాన్ మాటలకు వేదిక నుంచి కౌంటర్కు దిగారు.
India pulls up Pakistan in UN Platform