సమరోత్సాహంతో పంజాబ్.. నేడు రాజస్థాన్తో పోరు
షార్జా: పటిష్టమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన రెండో మ్యాచ్లో భారీ తేడాతో గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ మెరుగ్గా కనిపిస్తోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ కూడా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్లో కూడా గెలవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. అయితే రాజస్థాన్తో పోల్చితే పంజాబ్ కాస్త పైచేయిగా ఉందని చెప్పాలి. కెప్టెన్ లోకేశ్ రాహుల్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కళ్లు చెదిరే సెంచరీతో చెలరేగి పోయాడు. ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ కూడా జోరుమీద కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్లో అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ బెంగళూరుపై కూడా పర్వాలేదనిపించాడు.
అయితే నికోలస్ పురాన్, మాక్స్వెల్లు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇది ఒక్కటే పంజాబ్ను కలవరానికి గురి చేస్తోంది. వీరిద్దరూ కూడా తమ బ్యాట్కు పని చెబితే పంజాబ్కు ఎదురే ఉండదు. ఇక మహ్మద్ షమి, షెల్డన్ కాట్రెల్, మురుగన్ అశ్విన్, రవి బిష్నోయి తదితరులతో బౌలింగ్ కూడా చాలా బలంగా మారింది. షమి, అశ్విన్లు నిలకడగా రాణించడం జట్టుకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఇక తొలి మ్యాచ్లో చెన్నై వంటి బలమైన జట్టును ఓడించిన రాజస్థాన్ కూడా ఆత్మవిశ్వాసంతో మ్యాచ్కు సిద్ధమైంది. తొలి మ్యాచ్లో సిక్సర్లతో విరుచుకు పడిన సంజు శాంసన్ ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి జట్టుకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యాయి. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్, సీనియర్ బ్యాట్స్మన్ రాబిన్ ఉతప్పలతో రాజస్థాన్ బ్యాటింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగాసాగడం ఖాయమని చెప్పక తప్పదు.
IPL 2020: RR vs KXIP Match Tomorrow