తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు సూచన
చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె అధినేత్రి, దివంగత జయలలిత మొత్తం నివాసాన్ని మెమోరియల్గా మార్చడం కన్నా ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయంగా, నివాసంగా మార్చుకోవచ్చని మద్రాస్ హైకోర్టు బుధవారం సూచించింది. ప్రైవేట్ ఆస్తులను మెమోరియల్గా ప్రజా ధనంతో మార్చడం, వాటిని నిర్వహించడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని, దానికి అంతం అంటూ ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే పొయెస్ గార్డెన్ లోని ఒక భాగాన్ని స్మారక చిహ్నంగా మార్చుకోవచ్చని కోర్టు పేర్కొంది. అయితే పొయస్ గార్డెన్ లోని జయలలిత నివాసం వేదనిలయాన్ని మెమోరియల్గా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. పొయస్ గార్డెన్ను తాత్కాలికంగా తీసుకుంటున్నట్టు చెబుతూ ఈమేరకు ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది.
జయలలిత ఆస్తిపై తమకు హక్కు ఉందంటూ జయలలిత మేనల్లుడు దీపక్, మేనకోడలు దీప కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు పై విధంగా స్పందించింది. ఇటువంటి వాటిని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చితే ప్రజాధనం వృధా కాకుండా ఉంటుందని కోర్టు సూచించింది. ఈ ఆస్తికి వారసులైన దీప, దీపక్లతో ఈ విషయం చర్చించాలని, అవసరమైతే డబ్బులు చెల్లించి ఆ తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. జస్టిస్లు ఎన్. కిరుబకరన్, అబ్దుల్ ఖుద్దోస్లతో కూడిన బెంచి ఈ కేసు విచారణను ఎనిమిది వారాల పాటు వాయిదా వేసింది.