వనపర్తి: రైతును రాజును చేయాలన్నదే సిఎం కెసిఆర్ సంకల్పమని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దసరా వరకు రైతు వేదికలు సిద్ధం కావాలని, త్వరితగతిన పూర్తయ్యేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నం పెట్టే రైతన్నలు అగ్రభాగాన నిలవాలని, రైతులు నష్టాల బాట వీడి లాభాల బాట పట్టాలన్నారు. రైతు వేదికల ద్వారా రైతులను సంఘటితం చేయాలన్నదే కెసిఆర్ ఆలోచన అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఉత్పత్తికి ధర నిర్ణయిస్తున్నారని, రైతు మాత్రం తను పండించిన పంటకు ఇతరులు నిర్ణయించే ధర కోసం ఎదురు చూస్తున్నారన్నారు.
రైతు బాగుంటేనే తన చుట్టూ ఉన్న వర్గాలన్నీ బాగుంటాయని, పంటలు పండితేనే పల్లెలు చల్లగా ఉంటాయని, గత ఆరేళ్లుగా కెసిఆర్ దేశంలోని ఏ తెలంగాణ రాష్ట్రంలో లేనివిధంగా ఏడాదికి దాదాపుగా 60 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ, దాని అనుబంధ రంగాలపై ఖర్చు చేస్తున్నామన్నారు. రైతు బంధు, రైతుభీమా పథకాలతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నామని, సాగు నీటి ప్రాజెక్టుల ద్వారా నీరు అందిస్తూ అండగా నిలుస్తున్నామని సింగిరెడ్డి ప్రశంసించారు. ఆరేళ్లలో వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రైతు వేదికల ద్వారా వ్యవసాయంలో రైతులకు నూతన మెళకువలు, కొత్త సాంకేతిక పద్ధతులు నేర్పించామన్నారు. రైతుల విజయగాధలను అందించి స్ఫూర్తినందిస్తున్నామన్నారు. వ్యవసాయం లేనిదే ప్రపంచం మనుగడ సాధించలేదని, రైతువేదికల నిర్మాణం, నిర్వహణలో వ్యవసాయ అధికారుల పాత్ర కీలకమన్నారు.