హైదరాబాద్: కెసిఆర్ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వమని ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రజల బాధలు తెలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్ భారీ వర్షం కురుస్తుండగానే ఎక్కడికక్కడ అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తంచేసి క్షేత్రస్థాయిలో పర్యాటించాలని ఆదేశించినట్లు కెటిఆర్ చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు ఇచ్చిన రూ.550 కోట్లతోపాటుగా అవసరమైతే మరో వందకోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిఎం కెసిఆర్ చెప్పారని కెటిఆర్ తెలిపారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో దేశం మొత్తం చూస్తుంటుంది. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు సిఎం కెసిఆర్ చాలా ముందుచూపుతో స్వయంగా మార్గనిర్ధేశం చేశారని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా జిల్లాల్లోనే ఉండి రైతులను ఆదుకోవాలని ఆదేశించారని ఆయన గుర్తు చేశారు.హైదరాబాద్లో వరదలు వచ్చినా, రాష్ట్రంలో పంటనష్టం జరిగినా తక్షణం అధికారులను,మంత్రులను పరుగులు పెట్టించి ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసకున్నారని చెప్పారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కెటిఆర్ హెచ్చరించారు. మనహైదరాబాద్ మన బిజెపి అంటూ బిజెపి నినాదాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్ కోసం బిజెపి ఏమి చేసిందని ఈ నినాదం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లో వరదలు వస్తే బిజెపినాయకులు దుబ్బాకలో ఉన్నారని విమర్శించారు.