వలస కార్మికులకు ఆశ్రయమిచ్చి తిండిపెట్టి, ఆర్థికసాయం చేసిన రాష్ట్రం ఒక్క తెలంగాణయే : సంజయ్ బారు
మన తెలంగాణ/హైదరాబాద్ : వలస కూలీలకు భరోసానిచ్చిన నాయకులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? అంటే అది కేవ లం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేన ని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ మీడి యా సలహాదారు.. ప్రముఖ జర్నలిస్టు సంజయ్ బారు ప్రస్తుతించారు. లాక్డౌన్ వేళ ఎవరూ అర్థాకలితో అలమటించకూడదని సిఎం కెసిఆర్ భావిస్తూ వచ్చారు. ప్రధానంగా వివిధ రాష్ట్రాల నుంచి జీవనోపాధి నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగని రీతిలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని విధంగా వలస కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం, భోజన వసతి కల్పించారు. వలస కూలీలంతా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, వారినందరినీ తాను గుండెల్లో పెట్టుకుని కాపాడుతానని పలు సందర్భాల్లో సిఎం కెసిఆర్ చెప్పారన్నారు. వలస కూలీలకు ఏ కష్టం వచ్చినా సహించేది లేదని ఆ దిశగా వారి బాగోగులను చూసుకునేందుకు అధికారులను పరుగులు తీయించారన్నారు. లాక్డౌన్ వేళ చిక్కుకుపోయిన వలస కూలీలంతా తమ తమ ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో సైతం సిఎం కెసిఆర్ స్పందించారన్నారు.
మీకు ఏ లోటు రానిచ్చే ప్రసక్తి ఉండబోదని.. హాయిగా ఇక్కడే ఉండండి.. ఇక్కడే జీవనోపాధి చేసుకుంటూ హాయిగా జీవించండని చెప్పేవారన్నారు. లాక్డౌన్ వేళ ఎక్కడివారు అక్కడ ఉండటమే శ్రేయస్కరమని చెప్పడంతో పాటు వలస కార్మికులకు ఎలాంటి కష్టనష్టాలు రాని విధంగా వారిని ఒక రకంగా తమ కన్నబిడ్డల్లా చూసుకున్న ఏకైక సిఎం కెసిఆర్ అనడంలో అతిశయోక్తి లేదన్నారు. పలు మీడియా సమావేశాల్లో సైతం వలస కార్మికుల అంశం ప్రస్తావనకు తేవడంతో పాటు వలస కార్మికులు ఏ విధంగా ఉన్నారు? వారికి సరైన సదపాయాలు అందుతున్నాయా? ప్రభుత్వ సహాయం నేరుగా వలస కూలీలకు అందుతోందా? తదితర అంశాలను ముందుగానే అధికారులను అడిగి సిఎం కెసిఆర్ తెలుసుకునేవారన్నారు.
భార్యాబిడ్డలనొదిలి లాక్డౌన్ వేళ చిక్కుకుపోయిన వలస కార్మికులను ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత తన భుజస్కందాలపై సిఎం కెసిఆర్ వేసుకున్నారు. అంతేకాదు, వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వస్తుండటంతో మీడియా సమావేశాల్లో వారికి అర్థమయ్యే రీతిలో హిందీలో సైతం మాట్లాడి వలస కార్మికుల్లో ఎనలేని భరోసా, ధైర్యాన్ని సిఎం కెసిఆర్ కల్పించారన్నారు. ఇంతటి సాహసోపేత చర్యను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టలేకపోయారనేది నిర్వివాదాంశమేనన్నారు. అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ సడలింపుల వేళ వలస కార్మికులందర్నీ తమ తమ స్వస్థలాలకు పంపేందుకే మొగ్గుచూపగా.. సిఎం కెసిఆర్ మాత్రం తనదైన రీతిలో వలస కార్మికులకు భరోసానిచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు.