హైదరాబాద్ : భారతదేశం అంతటా తమ కంపెనీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లాంట్ను తరలించాలనే ఆలోచన తమకు లేదని గురువారం కియామోటర్స్ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎపి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాయిటర్స్ ప్రచురితమైన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని, కియా, ఎపి ప్రభుత్వం రెండు కలిసే పని చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మీడియాకు తెలిపారు.
ఎపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కియా మోటర్స్కు సంపూర్ణ సహకారం అందించారని, గతేడాది డిసెంబర్లో కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా కంపెనీ నిర్వహించిన కార్యక్రమానికి సిఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై కంపెనీ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామనే అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. అయినప్పటీకి కియా మోటర్స్ తరలిపోతుందంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రసారం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఖండించడంతో పాటు తీవ్రంగా పరిగణించింది. తప్పుడు ప్రచారం ఎందుకు చేశారు? దీని వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
స్పందించిన తమిళనాడు ప్రభుత్వం…
మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందన్న ప్రచారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తాము కియా యాజమాన్యంతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ప్రభుత్వంతో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు పరిశ్రమల ప్రధాన కార్యదర్శి ఎపి పరిశ్రమల కార్యదర్శికి ఫోన్చేసి మాట్లడినట్లు సమాచారం. ఇదిలావుండగా కియా పరిశ్రమ తరలింపుపై వస్తున్నవన్నీ గాలి వార్తలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి గోరంట్ల మాధవ్ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కియా పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదన్నారు. కియా అభివృద్ధికి ఎపి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. స్థానికుల్లో అర్హులు లేకుంటే ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వొచ్చునని ఎంపి గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.
Kia Motors not moving out of Andhra Pradesh