దుబాయి: వరుస విజయాలతో ఐపిఎల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక దశలో వరుస ఓటములతో ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు వైదొలిగిన పంజాబ్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. ఆరంభంలో ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే గెలిచిన పంజాబ్ మళ్లీ రేసులో నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో సఫలమయ్యాడు. అతని ప్రోత్సహంతో ఆటగాళ్లు సమరోత్సాహంతో పోరాడుతున్నారు. వరుగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. లోకేశ్ రాహుల్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
యువ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, మన్దీప్ సింగ్, నికోలస్ పూరన్ తదితరులు నిలకడైన బ్యాటింగ్తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ పంజాబ్ అసాధారణ పోరాట పటిమతో వరుస విజయాలు సాధిస్తోంది. దీంతో రాహుల్ సేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఆకాశ్ చోప్రా, యువరాజ్ సింగ్, సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు పంజాబ్ జట్టును పొగడ్తలతో ముంచెత్తారు. పంజాబ్ ఆటను చూస్తుంటే ఈసారి కచ్చితంగా ట్రోఫీ సాధించేలా కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఇక అభిమానులు కూడా పంజాబ్ ఆటకు ఫిదా అవుతున్నారు. క్రిస్ గేల్, రాహుల్ బ్యాటింగ్ తీరును చూసి మురిసి పోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్లను అభినందనలతో ముంచెత్తుతున్నారు.