ముంబై: ఇటీవలి భారీ వర్షాలతో దెబ్బతిన్న రైతాంగానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ 10,000 కోట్ల పరిహార ప్యాకేజీని ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. కుండపోత వర్షాలతో ఇటీవల రాష్ట్రంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో పంటలు నాశనం అయ్యాయి. దీనిని పరిగణనలోకి తీసుకుని రైతులకు ఈ పరిహారం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి థాకరే తెలిపారు. గత వారం కురిసిన భారీ వర్షాలలో పంటలు దెబ్బతిన్న రైతులకు ఒకే మొత్తంలో నగదు సాయం అందించేందుకు రూ 5500 కోట్లను కేటాయించినట్లు వివరించారు.
రాష్ట్రంలోని పది జిల్లాలో ఎడతెరిపిలేని వానలతో పది లక్షల హెక్టార్లకు పైగా భూములలో పంటలు దెబ్బతిన్నాయి. అంతకు ముందు వర్షాలు వరదల పరిస్థితిపై మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్యాకేజీని ప్రకటించారు. రాష్ట్రం పలు విధాలుగా ఆర్థిక ఇబ్బందులలో ఉన్న దశలో బిజెపి నాయకత్వపు ఎన్డిఎ కూటమి కేంద్ర ప్రభుత్వం జిఎస్టి బకాయిలపై జాప్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి ఈ పరిధిలో కేంద్రం నుంచి రూ 38000 కోట్లు రావాల్సి ఉందని, వీటిని విడుదల చేయకుండా మీనమేషాలు లెక్కపెడుతున్నారని థాకరే చురకలు పెట్టారు. రైతులకు హెక్టారుకు రూ పది వేల రూ పాతికవేల చొప్పున వారు వేసిన పంటలు జరిగిన నష్టం వివరాల ప్రాతిపదికన ఇస్తామని వివరించారు. ఈ సాయాన్ని దివాళీ (నవంబర్ 14)లోగానే రైతులకు చేరేలా చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.