అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశించారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిందన్నారు. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కూడా పెద్దఎత్తున కోత పడిందన్నారు. కేంద్ర జిడిపి కూడా మైనస్ 24 శాతానికి పడిపోయిందన్నారు. దీని ప్రభావం రాష్ట్రాలపై పడుతుందన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వాస్తవానికి ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో అంచనా వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయిందన్నారు. ఏఏ శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో నిర్ణయించాలని అధికారులను సూచించారు. మొత్తం బడ్జెట్పై సమీక్ష నిర్వహించి, ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
ప్రతి దసరా పండుగ మరుసటి రోజు సెలవు
దసరా పండుగ మరుసటి రోజైన ఈ నెల 26వ తేదీని కూడా సెలవు దినంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఇకపై ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజును సెలవు దినంగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఉద్యోగ సంఘల నాయకులతో సమావేశమై అన్ని అంశాలను చర్చించి, సమస్యలను పరిష్కరించునున్నట్లు సిఎం వెల్లడించారు.
CM KCR Interim Review on Annual Budget