చెన్నై : హైదరాబాద్ ఎంపి అసుదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం తమిళనాడులో కూడా పాగా వేసేందుకు ఎంఎంఐం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ముస్లిం పార్టీలతో పాటు సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీతో జతకట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న వెల్లూర్, రాణీపేట్, తిరపత్తూర్, క్రిష్టగిరి, రామనాథపురం, పుదుకొట్టై, తిరుచి, ముధురై, తిరునల్వేలి జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్ నేతలతో హైదరాబాద్లో శనివారం భేటీ అయిన ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఫలవంతమైన చర్చలు జరిగాయంటూ ట్వీట్ చేశారు.