Monday, April 29, 2024

లంచం కోసం ‘మంత్రి’ ఒత్తిడి..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటకలో ఇటీవల కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏకంగా ఆ రాష్ట్ర మంత్రే లంచం కోసం అధికారులను వేధిస్తున్నట్టు ఆరోపణలు రావడం గమనార్హం. ఈ వ్యవహారంపై కొంతరు ఉన్నతాధికారులు గవర్నర్‌కే ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేసింది. అయితే ఈ లేఖ నకిలీదని పేర్కొన్న ప్రభుత్వం , సదరు మంత్రిపై వచ్చిన ఆరోపణలు, లేఖ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. వ్యవసాయ శాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్ల ద్వారా తనకు ప్రతినెలా తలా రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని ఆ శాఖ ఉద్యోగులపై మంత్రి చెలువరాయస్వామి ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై మండ్య జిల్లా వ్యవసాయ శాఖకు చెందిన ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌కు రాసినట్టు ఉన్న లేఖ సోషల్ మీడియాలోవైరల్ అయింది.

ఇలాంటి అవినీతి సంప్రదాయాన్ని నియంత్రించకుంటే తమ కుటుంబాలతో కలిసి ఆత్మహత్యలకు పాల్పడతామని బాధితులు హెచ్చరించారు. ఆ లేఖను చీఫ్ సెక్రటరీ వందితాశర్మకు పంపించిన గవర్నర్ గహ్లోత్ దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారనే వార్తలు వచ్చాయి. ఈ లేఖ వ్యవహారంపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య అది నకిలీదని పేర్కొన్నారు. బీజేపీ, వారి మిత్రపక్షం (జేడీఎస్‌ను ఉద్దేశిస్తూ) దానిని సృష్టించాయని ఆరోపించారు. అయినప్పటికీ మంత్రిపై వచ్చిన ఆరోపణల కేసును సిఐడీకి అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అంతకు ముందు ఇదే విషయంపై మాట్లాడిన సిద్ధ రామయ్య, ఆ లేఖను ఏ అధికారి రాయలేదని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చెప్పారని అన్నారు. అటు ఈ వ్యవహారంపై బీజేపీ, జేడీఎస్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీలు మండిపడ్డాయి. ఒకవేళ అది నకిలీదైతే గవర్నర్ ఎందుకు స్పందిస్తారని ప్రశ్నించాయి. ఇలా అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రిని సీఎం వెనకేసుకు రావడం దారుణమని దుయ్య బట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News