బ్రిటన్ తాజా అధ్యయనం హెచ్చరిక
లండన్: బ్రిటన్లో వ్యాప్తిచెందుతున్న రూపాంతరం చెందిన కరోనా వైరస్ పాత వైరస్కన్నా వేగంగా ఒకరినుంచి మరొకరికి సోకుతోందని, దీని కారణంగా కొత్త సంవత్సరంలో ఎక్కువ మంది ఆస్పత్రి పాలు కావడం, ప్రాణాలు కోల్పోవడం జరగవచ్చని తాజాగా జరిపిన అధ్యయనం వెల్లడించింది. రూపాంతరం చెందిన ఈ వైరస్ ఇతర స్ట్రెయిన్లకంటే 56 శాతం ఎక్కువగా ఒకరినుంచి మరొకరికి సోకే లక్షణాలు కలిగి ఉందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, అండ్ ట్రాపికల్ మెడిసిన్లోని సెంటర్ ఫర్ మ్యాథమాటికల్ మోడలింగ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ జరిపిన తాజా అధ్యయనంతో వెల్లడైంది. అయితే ఈ వైరస్ వల్ల ఎక్కువగా మరణాలు సంభవిస్తాయా లేదా తక్కువగా సంభవిస్తాయనే దానికి మాత్రం స్పష్టమైన సాక్షాధారాలు మాత్రం లేవు.
కాగా ఈ రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్ మిగతా స్ట్రెయిన్లకన్నా 70 శాతం ఎక్కువగా ఒకరినుంచి మరొకరికి సోకే అవకాశం ఉందని బ్రిటన్ ఇంతకు ముందు ప్రకటించింది. అంతేకాకుండా ఇది దాదాపుగా రెండు డజన్ల పరివర్తనాలను కలిగి ఉందని బ్రిటన్ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ పాట్రిక్ వాలెన్స్ ఈనెల 19న ప్రకటించారు కూడా. దీంతో ఇప్పుడు విడుదలవుతున్న వ్యాక్సిన్లు దీనిపై అంతగా ప్రభావం చూపించవేమోనన్న అనుమానాలు మొదలైన విషయం తెలిసిందే. అయితే రూపాంతరం చెందిన ఈ వైరస్ ఇంతకుముందున్న వైరస్కన్నా పెద్దగా భిన్నమైనది కాదని, అందువల్ల ఇప్పుడు ఆవిష్కృతమవుతున్న వ్యాక్సిన్లు కూడా దీనిపై పని చేస్తాయని యూరోపియన్ యూనియన్ చీఫ్ హెల్త్ రెగ్యులేటర్ ఇప్పటికే స్పష్టం చేశారు.