హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టంలో రెవెన్యూ అధికారుల అధికారాలను కుదించిన ప్రభుత్వం తాజాగా వ్యవసాయేతర భూమి వినియోగ మార్పిడి అధికారాల నుంచి ఆర్డీఓలను తప్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. ‘నాలా’ అనుమతులకు సంబంధించి తహసీల్దార్లకు అధికారాన్ని కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్డీఓల నుంచి ఈ అధికారాలను తహసీల్దార్లకు బదలాయించే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సాగు భూములను ఇతర అవసరాలకు మార్పిడి చేయాలంటే ఆర్డీఓకు ‘నాలా’ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే దీనిపై క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు, ప్రతిపాదిత భూమిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్కు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేస్తారు. దీనివలన ‘నాలా’ అనుమతులకు ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. భూ వినియోగ మార్పిడిపై దరఖాస్తు చేసుకున్న వారంరోజుల్లోపే సాగు భూమి విస్తీర్ణం నుంచి ఇతర అవసరాలకు మళ్లుతున్న భూమిని తొలగించేలా తహసీల్దార్లకు అధికారాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
Nala Permits Are For Tahsildars