మనతెలంగాణ/హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్వర్మకు నల్గొండ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ సోమవారం కోర్టు వర్మకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండలో హత్యకు గురైన ప్రణయ్ ప్రేమ వ్యవహారం ఆధారంగా రాంగోపాల్వర్మ మర్డర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తమపై చిత్రీకరిస్తున్న సినిమాను నిలిపివేయాలంటూ ప్రణయ్ భార్య అమృత గత నెలలో కోర్టులో సివిల్ దావా వేసింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. ప్రణయ్ హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు మర్డర్ సినిమాను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా విషయమై గతంలోనే ఆర్జీవీ స్పందించారు. మర్డర్ సినిమాతో ఇతరుల్ని చెడుగా చూపించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
ఈ కేసు కవర్ చేసిన ఓ పాత్రికేయుడి కోణంలో ఈ సినిమా ఉండొచ్చు! విచారణ చేసిన పోలీసు అధికారి ఆలోచనలకు సంబంధించింది కావొచ్చు.. వివిధ మాధ్యమాల ద్వారా దీని గురించి తెలుసుకున్న వ్యక్తి ఉద్దేశం అయినా కావొచ్చు. ఓ దర్శక, నిర్మాతగా నా ఆలోచనల ప్రకారం మర్డర్ను తెరకెక్కించే హక్కు నాకుంది. కొందరిని చెడుగా చూపించడానికి నేను ఈ సినిమాను తీస్తున్నాను అనుకోవడం సరికాదు. ఎందుకంటే.. ఏ వ్యక్తి చెడు కాదని నేను గట్టిగా నమ్ముతా. కేవలం ప్రతికూల పరిస్థితులు వ్యక్తిని చెడ్డవాడిని చేస్తాయి. అలా ప్రవర్తించేందుకు కారణమౌతాయి. దీన్నే నేను మర్డర్లో చూపించాలి అనుకుంటున్నా. ఆ ప్రకటన రాసిన వారికి నేను చివరిగా ఒకటి చెబుతున్నా మనుషులపై, వారి ఫీలింగ్స్పై నాకు గౌరవం ఉంది. వారు పడ్డ బాధను, నేర్చుకున్న పాఠాన్ని గౌరవిస్తూ మర్డర్ తీయబోతున్నానని వర్మ పేర్కొన్నారు.
Nalgonda district court orders stay on RGV’s Murder Film